(విజయవాడ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
విజయవాడ దుర్గగుడి సమీపంలో బుధవారం పెనుప్రమాదం తప్పింది. ఇంద్రకీలాద్రి సమీపంలో కొండచరియలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌన స్వామి ఆలయం వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో అక్కడివారంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను సమపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడటంతో ఒ రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో శిధిలాలను వేగంగా తొలగిస్తున్నారు. కొండ చరియలు విరిగిపడిన నేపత్యంలో ఇప్పటికే దర్శనాలను నిలిపివేశారు.
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు కొద్దిసేపటిలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇంద్రకీలాద్రికి రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆ ప్రదేశంలో రాకపోకలను నిలిపివేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తం సహాయక చర్యలు వేగవంతం చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో చిన్న చిన్న రాళ్లు విరిగిపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల్లో అక్కడి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఇంజనీరింగ్ అధికారులు ముందే హెచ్చరించారు. అయితే అధికారులు చెప్పినదానికంటే ముందుగానే బుధవారం కొండ చరియలు విరిగిపడ్డాయి.