రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అతి కీలకమైన రెండు అంశాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కనుక మెతకవైఖరి అవలంబిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం అయ్యే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.కేంద్రం మెడలు వంచైనా ఆ రెండు అంశాలలో సానుకూల ఫలితాలను రాబడితేనే జగన్ కి భవిష్యత్తు ఉంటుందని వారు చెబుతున్నారు.ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ఆ రెండు అంశాలను జగన్ పక్కనబెడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు.అయితే ఆ రెండూ కూడా ఇప్పుడు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి.
అందులో ఒకటైన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎప్పుడో తలుపులు మూసేసింది.కానీ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు ఎంపీలను అధిక సంఖ్యలో ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని అన్నది బహిరంగ ప్రకటన చేశారు.మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వైసిపి ఎంపీలు ఇరవై రెండు మంది గెలిచారు.సంఖ్యాబలం దృష్ట్యా లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ వైసిపి.అయినప్పటికీ వైసిపి ఎంపీలు గానీ జగన్ గానీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయడం అటుంచి అసలు ఆ ఊసే ఎత్తటం మానేశారు.స్వాతంత్ర దినోత్సవ సందేశంలో జగన్ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించినప్పటికీ ఆ తదుపరి ఫాలోఅప్ యాక్షన్ లేదు. హోదా వచ్చి ఉంటే కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి తరలి వచ్చి అనేక విధాలుగా ప్రయోజనం కలిగే అవకాశాలు ఉండేవి. ఇక తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయానికొస్తే కేంద్రం పెద్ద మెలికే పెట్టి ఏపీ ప్రభుత్వం నెత్తిన గుదిబండ మోపింది.ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే ఇస్తామని, పునరావాస ప్యాకేజీ తో తమకు సంబంధం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది.
పోలవరం ప్రాజెక్టు వ్యయం యాభై అయిదు వేల కోట్ల రూపాయలు కాగా కేంద్రం ఇస్తానంటోంది కేవలం ఇరవై వేల కోట్లు.మిగతా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది సాధ్యమయ్యే పనికాదు.పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిది.దాన్ని పూర్తి చేయలేకపోతే భావితరాలవారు పాలకులను క్షమించరు.పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో జగన్ కూడా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని నానా మాటలు అన్నారు.ఇప్పుడు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ఏమీ చేయలేని పక్షంలో అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ముందు ఆయన తలదించుకోవాల్సి వస్తోంది.కేంద్రానికి అవసరమున్నా లేకున్నా మద్దతిస్తున్న వైసీపీ ఈ రెండు విషయాల్లో గట్టిగా పట్టుబట్టి ప్రధానిని ఒప్పించగలిగితేనే జగన్ తెలుగు ప్రజలకు ముఖం చూపించగలరని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.