తెలంగాణ లో ఎన్నికలు ఉన్న సమయంలో రాజకీయంగా ఎంత వేడి ఉంటుందో… ఎన్నికలు లేని సమయంలోనూ అంతే హీట్ ఉంటుంది. రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూ ఉంటుంటాయి. అలాంటి రాజకీయ కామెంట్ల పర్వంలోనిదే తాజా సంఘటన . గత కొద్దిరోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
గతంలో జరిగిన ఎన్నికలు , రాబోయే ఎన్నికలు ఇలా వివిధ అంశాలను విజయశాంతి ప్రస్తావించారు. “సీఎం కేసీఆర్ గారు కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్పై వెనక్కి తగ్గడం… ఇలా గత నాలుగైదు రోజులుగా కేసీఆర్ గారు చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటు. ఎన్ని వరాలు కురిపించినా ప్రజలు కేసీఆర్ను నమ్మబోరు `అని విజయశాంతి ఎద్దేవా చేశారు.
గుండెలు బాదుకున్నారు….
గడచిన టీఆరెస్ ఆరేళ్ళ పాలనా కాలంలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు ఒకొక్కటిగా దృష్టి సారిస్తుండటం వెనుక కుట్ర కాకుండా ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు అని విజయశాంతి వ్యాఖ్యానించారు. “దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిణామాలే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉప ఎన్నికల్లోనూ వస్తే… ఈ సీఎం గారు ఎంతో కొంత జన సంక్షేమం గురించి కనీసం ఆలోచించి, తద్వారా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ, సమయం, అపాయింట్మెంట్లు ఇచ్చి ప్రజా సమస్యలపై కొంత దృష్టి పెట్టే ప్రయత్నం జరగవచ్చు. అందుకోసమైనా తదుపరి ఎన్నికల ముందువరకూ కొంతకాలం అధికారంలో ఉండే ఈ టీఆరెస్ ప్రభుత్వానికి, ప్రతి సందర్భంలోను ఓటమి రుచి చూపించవలసిన బాధ్యత ఉందని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోంది.” అంటూ విజయశాంతి ఫైర్ అయ్యారు. కొత్త సంవత్సరం ఎంట్రీ ఇస్తున్న తరుణంలో విజయశాంతి చేసిన ఈ కామెంట్లపై టీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో మరి.