Family commits Suicide: కరోనా సెకండ్ వేవ్ అనేక కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా మరణించారు. తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాధలు అయినవారు ఉన్నారు. సన్నిహితులు, బంధువులు కరోనాతో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కర్నూలు పట్టణంలో జరిగింది. కర్నూలు నగరంలోని వడ్డేగేరిలో నివాసం ఉండే ఓ కుటుంబంలోని నలుగురు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
టీవీ మెకానిక్ గా పని చేస్తూ జీవనం సాగించే ప్రతాప్ (42), ఆయన భార్య హేమలత (36), పిల్లలు జయంత్ (17), రిషిత (14) లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం వీరు ఇంటి తలుపులు ఎంతకీ తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రతాప్ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్లి చూడగా నలుగురు కుటుంబ సభ్యులు విగతజీవులై కనిపించారు. మృతదేహాల వద్ద పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కరోనా కారణంగా తమ బంధువులు, స్నేహితులు చనిపోయారన్న మనస్థాపంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More: Karnam Malleswari: పద్మశ్రీ కరణం మల్లీశ్వరికి కీలక పదవి
విషయం తెలిసి పరిసర ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ప్రతాప్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై ప్రతాప్ రక్తసంబంధీకులు, బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటంతో వడ్డేగేరి ప్రాంతంలో విషాదశ్ఛాయలు అలుముకున్నాయి.