Uttar Pradesh: జనాభాలో భారత్ ప్రపంచంలోనే రెండవ స్థానం అన్నది అందరికీ తెలిసిందే. క్రమంగా జనాభా పెరిగిపోతూనే ఉంది. కొన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజా ప్రతినిధులుగా పోటీ చేయాలంటే ఇద్దరుకు మించి సంతానం ఉండకూడదని ఆంక్షలు ఉన్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా జనాభా నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. తక్కువ సంతానం ఉన్న వారికి రకరకాల ప్రోత్సాహాకాలు ఇవ్వడంతో పాటు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హతతో పాటు సంక్షేమ పథకాల్లో కోత విధించనుంది. దీని కోసం ఓ ముసాయిదాను రూపొందించింది యూపి ప్రభుత్వం. యూపీ జనాభా బిల్లు 2021పై ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు ఈ నెల 19వ తేదీ వరకూ సమయం ఇచ్చారు.
ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు సంతానంగా ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు కానున్నారు. అలాంటి తల్లిదండ్రులకు ప్రభుత్వ సబ్సిడీ పథకాలు కూడా వర్తించకుండా చట్టాన్ని రూపొందిస్తున్నారు. ఈ చట్టం ఆమోదం పొందిన తరువాత ఎక్కువ పిల్లలు ఉంటే వారు ప్రభుత్వ ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా ఈ కొత్త చట్టాన్ని వర్తింపజేయనున్నారు.
అయితే యోగి ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ కొత్త చట్టంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇది కేవలం రాష్ట్రంలో ముస్లింలను టార్గెట్ చేసేందుకేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక సంతానం ఒక్కరే ఉంటే వారికి ఐఐటీ, ఎయిమ్స్ వంటి వాటిలో సులువుగా సీటు సాధించే అవకాశం కూడా కల్పించనున్నట్లు చెబుతోంది యోగి ప్రభుత్వం.
మరో విషయం ఏమిటంటే ఇద్దరే ముద్దు అన్న విధానాన్ని పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్లు పొందుతారు. ఇక ఒక్క పిల్లవాడే ఉన్న వాళ్లకు నాలుగు అదనపు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు ముసాయిదాలో వెల్లడించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు ఒక్కరినే కంటే అబ్బాయి అయితే రూ.80వేలు, అమ్మాయి అయితే రూ.లక్ష ఇవ్వనున్నట్లు ముసాయిదాలో పేర్కొన్నారు.