Somu Veerraju: ప్రతిపక్షంలోఉన్నాం కాబట్టి అధికారపార్టీని నిలదీయొచ్చు కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే!బిజెపి ఎ.పి అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఇదే అనుభవం ఎదురవుతోంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసే సోము వీర్రాజు ఇవాళ అదే క్రమంలో ముఖ్యమంత్రిని ఓ విషయమై నిలదీశారు.అయితే అది సోము వీర్రాజు మెడకే చుట్టుకోవడం విశేషం.
అసలు మ్యాటరేంటంటే!
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ర్టాల మధ్య జల వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.కృష్ణా జలాలను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని తెలంగాణ మంత్రులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.మా వాటా మేము తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం వివరణ ఇస్తోంది. ఇదే విషయాన్ని కర్నూలు లో జరిగిన పార్టీ సమావేశంలో సోము వీర్రాజు ప్రస్తావిస్తూ ఒక సలహా ఇచ్చారు.ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం,చర్ల,వాజేడు మండలాలను గనుక ఆంధ్రప్రదేశ్ తన పరిధిలోకి తెచ్చుకోగలిగితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్య పరిష్కారం అవుతుందని సోము వీర్రాజు తెలిపారు.అయితే ఆ మూడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కి తెచ్చుకోగలిగిన సత్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉందా అని సోము వీర్రాజు నిలదీశారు.ఇదే ఇప్పుడు సోము వీర్రాజుకు ఇబ్బందికరమైన పరిస్థితి తెప్పిస్తోంది.
చెప్పడం కాదు!మీరే చేసి చూపించొచ్చుగా రాజుగారూ?
అదెలాగంటే ..మండలాలే కాదు ఏ కొంత భూమినైనా ఒక రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి బదలాయించాలంటే దానికి అనుమతి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే.గతంలో చంద్రబాబు నాయుడు కృషి చేసి తెలంగాణాలో ఉన్న ఏడు మండలాలను అప్పటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో కలుపుకున్నారు. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యపడింది.ఇప్పుడు రెండు రాష్ర్టాల మధ్య ఉన్న జల వివాదం ముగిసి పోవాలంటే మూడు మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కి బదలాయించుకోవాలని సోము వీర్రాజు చెబుతున్నారు.సలహా బాగానే ఉంది కానీ మండలాల బదలాయింపు కు అనుమతివ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం!కేంద్రంలో ఉన్నది సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బిజెపి పార్టీ!కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేసే బదులు ఆయనే తన పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించుకుని ఆ మూడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు బదలాయించేలా చేస్తే బాగుంటుంది కదా అని వ్యాఖ్యలు మొదలయ్యాయి.ఆ పని చేస్తే ఏపీలో బీజేపీ బలపడటానికి కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు.కాబట్టి సోము వీర్రాజు ఎదుటివారికి నీతులు చెప్పడానికి బదులు తానే ఏదైనా చేసి చూపి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బతికించుకోవాలని సొంత పార్టీ వారే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.