Mudragada Padmanabham: క్రియాశీల రాజకీయాలు, కాపు రిజర్వేషన్ ఉద్యమం నుండి పూర్తిగా తప్పుకున్నట్లు ప్రకటించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్ది రోజులుగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. అయితే ప్రత్యక్ష కార్యక్రమాలతో కాకుండా సమస్యలపై లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు ఎపిసోడ్ పై ఆయనకు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తనను, తమ కుటుంబాన్ని అవమానించారంటూ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ చేసి అసెంబ్లీ నుండి వాకౌట్ చేయడం, ఆ తరువాత పార్టీ కార్యాలయంలో గుక్కపడ్డి ఏడవడం తెలిసిందే. ఈ ఘటనను పురస్కరించుని ముద్రగడ .. చంద్రబాబుకు లేఖ రాశారు. గతంలో టీడీపీ హయాంలో తన కుటుంబంపై చేసిన దాష్టీకాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబును విమర్శించారు. ఆ తరువాత ప్రధాన మంత్రి మోడీకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలంటూ లేఖ రాశారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా విశాఖ స్టీల్ ప్లాన్ ను ప్రైవేటీకరణ చేస్తే భవిష్యత్తులో అనేక చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని ముద్రగడ హెచ్చరించారు.
ఇప్పుడు తాజాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక సూచన చేస్తూ ముద్రగడ లేఖ రాశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు సమస్య హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధాన్యం రైతాంగ సమస్యలపై లేఖ రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ముద్రగడ కోరారు. పాడైన ధాన్యం నుండి ఆర్ ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని సూచించారు. పరిశోధనలు ఫలిస్తే జిల్లాకు ఒక స్పిరిట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తద్వారా ధాన్యానికి మద్దతు ధర సమస్య ఉండదని అన్నారు. నిత్యం నీరు ఉండే పొలాల్లో వరి తప్పించి వేరే పంట కష్టమని ముద్రగడ పేర్కొన్నారు.