Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి తన రాజీనామా విషయంలో యూటర్న్ తీసుకున్నారు. తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన దివ్యవాణి కొద్ది సేపటికే ఈ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఒంగోలులో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందన్న ఆనందంలో ఉన్న టీడీపీకి దివ్యవాణి ఊహించని షాక్ ఇస్తూ ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి తెలిపారు. ఇంత వరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Divyavani: సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి కొడాలితో వ్యక్తిగత విభేదాలు లేవు
రాజీనామా ట్వీట్ చేయకముందు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహానాడులో తనకు అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీపై సీరియస్ కామెంట్స్ చేశారు. తాను టీడీపీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్నా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు దివ్యవాణి. ఒక కళాకారుడు (ఎన్టీఆర్) పెట్టిన పార్టీలో కళాకారులకు సరైన స్థానం లేకపోవడం తనని ఆవేదనకు గురి చేస్తొందని ఆమె పేర్కొన్నారు. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులుగా తాను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నాను అంటూ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా వైసీపీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో గానీ మాజీ మంత్రి కొడాలి నానితో కాని తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని అన్నారు దివ్యవాణి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దివ్యవాణి వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి.
బచ్చుల అర్జునుడు మాట్లాడటంతో..
అయితే దివ్యవాణి రాజీమానా ట్వీట్ చేసిన నేపథ్యంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు దివ్యావాణితో మాట్లాడినట్లు తెలిసింది. అర్జునుడు ఆమెతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. తాను టీడీపీని వీడటం లేదని ప్రకటించారు. అంతే కాకుండా రాజీనామా చేస్తున్నట్లు పోస్టు చేసిన ట్వీట్ ను దివ్యవాణి తొలగించారు. ఈ రోజు సాయంత్రం దివ్యవాణి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న మీడియా సమావేశంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. దివ్యవాణి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ అధికార ప్రతినిధిగా మీడియా సమావేశాల్లో అధికార పక్ష నేతలపై తన వాగ్ధాటితో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.