వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ అంతర్గత అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) వైసీపీకి స్ట్రాటజిస్ట్ గా పని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు చెందిన ఐప్యాక్ సంస్థ వైసీపీకి తెర వెనుక వ్యూహాలను అందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ నేరుగా దృష్టి పెట్టడం లేదు కానీ ఆయన టీమ్ లోని రిషీరాజ్ లాంటి డైరెక్టర్ లు ఏపి లో వైసీపీ రాజకీయ వ్యవహారాలు చూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఐప్యాక్ టీమ్ .. సీఎం జగన్ కు ఓ రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం. ఈ నివేదిక అయిదు అంశాలపై పరిశీలన చేసి ఇచ్చిందట. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జి ల పనితీరుపై గత నెల, ఈ నెలలో అయిదు అంశాలపై పరిశీలన చేసిన ఐ ప్యాక్ టీమ్ నియోజకవర్గాల వారీగా నివేదిక అందజేసిందట.
1.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే లేదా ఇన్ చార్జి ఏ విధంగా పాల్గొంటున్నారు.. ? ఈ కార్యక్రమం తీరు ఎలా ఉంది..? ప్రజలతో ఎంత మేరకు మమేకం అవుతున్నారు..? ప్రభుత్వం ఉద్దేశం నెరవేరుతోందా..? లేదా అనే అంశాలు. 2. ప్రజల్లో ప్రభుత్వ పథకాల పట్ల సానుకూలత పెరిగిందా..? లేదా.. ఈ రెండు మూడు నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు..? 3. సచివాలయాల పని తీరు. వాలంటీర్ల పనితీరు. 4. తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో ఎంత మేర బలపడింది. టీడీపీ అభ్యర్ధిత్వం ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీలో గ్రూపుల పరిస్థితి తదితర అంశాలు. 5. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కొనసాగించాలా..? లేక ఇన్ చార్జిగా మార్చాల్సిన అవసరం ఉందా..? పరిశీలకుడుగా ఎవరినైనా నియమిస్తే బాగుంటుందా.. నియోజకవర్గంలో పరిస్థితులు మెరుగుపడటానికి పరిశీలకుడుగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది.. ఇలాంటి అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారుట.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే..
గడప గడపకు మన ప్రభుత్వం ప్రారంభానికి రెండు నెలల ముందు అంటే మార్చి 15 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో భేటీ కావడం అదే ప్రధమం. ఆ తరువాత మే నెలలో గడప గడపకు మన ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత మరో సారి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారు. ఎవరెవరు పాల్గొనడం లేదు అనే విషయాలపై మాట్లాడారు. జూలై నెలలో కూడా మరో సారి ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని కామెంట్ చేశారు. సంక్షేమ పథకాలు బాగానే ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నానని తనపై సంతృప్తి స్థాయి అధికంగా ఉన్నా ఎమ్మెల్యేల పని తీరుపై ప్రజలు అసంతృప్తి కనబడుతోందంటూ క్లాస్ పీకారు. సరిగా పని చేయకపోతే టికెట్ లు ఇవ్వను అని కూడా తెగేసి చెప్పేశారు. ఈ విధంగా చెప్పి వారిని అలర్ట్ చేశారు.
Read More: Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..
త్వరలో ఎమ్మెల్యేలతో భేటీ
ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేలతో భేటీ అవ్వబోతున్నారు. ఈ నెల 15వ తేదీ (రేపు) నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అయిదు రోజుల్లో ఒక రోజు ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ నిర్వహించాలనేది వైసీపీ అంతర్గత ప్లాన్. ఈ అయిదు రోజులు అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు కాబట్టి పనిలో పనిగా వైసీపీ అంతర్గత సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకునే పీకే టీమ్ రిపోర్టు తెప్పించుకున్నారనేది అంతర్గత టాక్. ఈ ఎమ్మెల్యేల సమావేశంలో పార్టీ పరంగా పలు సూచనలు చేయనున్నారని సమాచారం. ఇక గడపగడప కు కార్యక్రమంలో బాగా చేస్తున్న వారిలో నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు, పర్చూరు ఇన్ చార్జి రావి రామనాధం బాబు, అద్దంకి ఇన్ చార్జి బాచిక కృష్ణ చైతన్య, ధర్మవరం ఎమ్మెల్యే తదితరులు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తొంది. అయితే గడప గడపకు మన ప్రభుత్వం ప్రారంభమైన నాలుగు నెలల కాలంలో అయిదు రోజుల కంటే తక్కువగా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నట్లు సమాచారం. జరగబోయే ఎమ్మెల్యేల సమావేశంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వీరికి ఎ విధంగా దిశానిర్దేశం చేస్తారో చూద్దాం.
Read More: అమరావతి అసైన్డ్ భూముల స్కామ్ కేసు.. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!