తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ని జాతీయ పార్టీ .. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరుతో మొదటి ఎన్నికలను ఫేస్ చేయాలని గులాబీ బాస్ కేసిఆర్ భావించారు. అయితే బీఆర్ఎస్ ను ఎన్నికల సంఘం గుర్తింపునకు సమయం పట్టే అవకాశాలు ఉండటం, మరో పక్క రేపటి నుండే మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ గానే గులాబీ పార్టీ రంగంలో ఉండనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వెల్లడించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ బుధవారం కీలక ప్రకటన చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశం ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించగా, అదే విషయాన్ని కేసిఆర్ ప్రకటించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్పు చేసినా పేరు మార్పిడిని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తేనే బీఆర్ఎస్ పేరు వాడుకలోకి వస్తుంది. అప్పటి వరకూ టీఆర్ఎస్ పేరుతోనే గులాబీ నేతలు కొనసాగాల్సి ఉంటుంది.
టీఆర్ఎస్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బుధవారం నాటి టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం తీర్మానం కాపీని, తమ పార్టీ పేరును బీఅర్ఎస్ గా గుర్తించాలంటూ కేసిఆర్ రాసిన లేఖను అందజేశారు. అనంతరం వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా పేరు మారడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రేపటి నుండే ప్రారంభం కానుండటంతో టీఆర్ఎస్ అభ్యర్ధిగా తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. పార్టీ పేరు మాత్రమే మారిందనీ, ఎన్నికల గుర్తు కాారు కొనసాగుతుందని వినోద్ కుమార్ తెలిపారు. బీఅర్ఎస్ గా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించే వరకూ టీఆర్ఎస్ గానే కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు రేపు (శుక్రవారం 7వ తేదీ) నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపటి నుండి ఈ నెల 14వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుంది. 6వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.
కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక