PM Modi: విశాఖలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూ.10,742 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశారు. మోడీ ప్రసంగానికి ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాలను ప్రస్తావించి వీటిని పరిష్కరించాలని కోరారు. అయితే పీఎం మోడీ ప్రసంగంలో వీటిపై నోరు మెదపలేదు. విశాఖ గొప్పతనాన్ని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి మాత్రమే మోడీ వివరించారు.
ప్రియమైన సోదరీ సోదరమణులకు స్వాగతం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన పీఎం మోడీ.. కొద్ది రోజుల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనే అదృష్టం కలిగిందన్నారు. ఈ రోజు ఏపీకి, విశాఖకు గొప్ప దినమని అన్నారు. విశాఖ దేశంలోనే విశేషమైన నగరమని పేర్కొన్న మోడీ.. విశాఖ ఓడ రేవు చారిత్రాత్మకమైనదనీ, ఇక్కడ నుండి పురాతన కాలంలో రోమ్ వరకూ వ్యాపారం జరిగేదన్నారు.ఈ రోజు కూడా విశాఖపట్నం ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందన్నారు. ఈ రోజు ప్రారంభించే రూ.10వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతో విశాఖ, ఏపి ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజక్టులతో ఏపి అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని చెప్పారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏపికి ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. కేవలం సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన గుర్తింపు మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు స్నేహ శీలత, సహద్బావం వల్లే ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారనీ, తెలుగు ప్రజలు ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తపన పడతారని కితాబు ఇచ్చారు.
మౌలిక వసతుల కల్పనలో తాము ఎప్పుడు వెనక్కు తగ్గలేదనీ. మౌలిక వసతుల అభివృద్ధి అన్ని రంగాల పురోగతిని వేగవంతం చేస్తొందని అన్నారు మోడీ. ఒక వైపు విశాఖ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరుస్తూనే మరో వైపు ఫిషింగ్ హార్బర్ ను అధునీకరిస్తున్నామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనతోనే ఏపి తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశమే అందరికీ ఆశావహ దృక్పదం ఇస్తొందన్నారు. తమ ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగుపర్చడం కోసమేనని చెప్పారు. ఒక వైపు తాము చేస్తున్న అభివృద్ధి తో దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని వివరించారు. మరో వైపు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నామని అన్నారు. రైతులకు ఏటా రూ.6వేల ఆర్ధిక సాయం అందిస్తున్నామన్నారు. కరోనా కాలం నుండి దేశ వ్యాప్తంగా పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నామని చెప్పారు మోడీ. ఈ వేదికపై రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. విశాఖ పర్యటన అనంతరం ప్రధాని మోడీ హైదరాబాద్ పయనమైయ్యారు.