ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విద్యాశాఖ పరిధి కింద పని చేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుండి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదు అనే నిబంధన ఉన్నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించలేదు. విద్యార్ధులకు పాఠాలు బోధించే వారు లేకపోయినా డిప్యుటేషన్ లు రద్దు చేయడం లేదనే మాట వినబడుతోంది. అనంతపురం జిల్లాల్లో కొందరు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధుల వద్ద పీఏలుగా కూడా పని చేస్తున్నారు. మరి కొన్ని జిల్లాల్లో డిప్యూటేషన్ పై పంచాయతీరాజ్, జైళ్ల విభాగాల్లోనూ విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 900 మంది ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉన్నట్లుగా ప్రాధమికంగా గుర్తించారు. పురపాలక శాఖలోనూ డిప్యూటేషన్ పై పని చేస్తున్న వారు అధికంగానే ఉన్నారు. సర్వశిక్షా అభియాన్ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో స్కూల్ అసిస్టెంట్ లు, ఎస్జీటీ, ప్రధానోపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరంతా బోధన విధులకు దూరంగా ఉంటున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దంటూ టీచర్స్ అసోసియేషన్స్ చాలా కాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
వర్చువల్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయానికి ఆమోదం
అయితే తాజాగా జగన్మోహనరెడ్డి సర్కార్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో ఇవేళ ఏపీ కేబినెట్ వర్చువల్ గా భేటీ అయి పాఠశాల విద్యాశాలకు సంబంధించి ఈ కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్దమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలకు వినియోగిస్తామని ఈ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం మంచిదే అన్న అభిప్రాయం చాలా వర్గాల్లో ఉంది.
అయితే తమ అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు ఇంతకు ముందు ఈ ఏడాది జనవరి నెలలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి. వేలాది సంఖ్యలో ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఆ తర్వాతనే విద్యాశాఖలో బయోమెట్రిక్ అటిండెన్స్ కాకుండా ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా హజరు నమోదు అమలు చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టాక్ మొదలైంది. సాధారణంగా ఎన్నికల విధులకు ఉపాధ్యాయులనే వినియోగిస్తుంటారు. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధులను అప్పగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ముందస్తు చర్యగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుందన్న మాట కూడా వినబడుతోంది.