హైదరాబాద్: నయీమ్ గ్యాంగ్లో భాగమైన అసలు టిఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాకుండా కెసిఆర్ ప్రభుత్వం జాగ్రత్త పడిందని మహిళా కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు.
ఈ వ్యవహారంలో కెసిఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు కెసిఆర్ ప్రభుత్వం మరో నాటకాన్ని మొదలు పెట్టిందని విమర్శిస్తూ తన ఫేస్బుక్ ఖాతాలో శుక్రవారం పోస్టు పెట్టారు.
గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులోని వివరాలను ఆర్టిఐ చట్టం కింద ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ధరఖాస్తు చేయగా నిన్న ఆర్టిఐ కేసు వివరాలు వెల్లడించింది.
నయీమ్ కేసులో మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, పలువురు మాజీ జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్లు, అడిషనల్ ఎస్పిలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్ రెడ్డి, డీఎస్పిలు శ్రీనివాస్, సాయి మనోహర్ రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్రావు, వెంకటనర్సయ్య పేర్లతో పాటు పంజాగుట్ట ఏసిపి తిరుపతన్న, ఇన్స్ పెక్టర్ మస్తాన్, శ్రీనివాసరావు, మజీద్, వెంకటరెడ్డి, వెంకట సుర్యప్రకాశ్, రవికిరణ్ రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేందర్ గౌడ్, దినేష్, సాదిఖ్మియా పేర్లు ఉన్నట్లు ఆర్టిఐ తెలిపింది. పలువురు టిఆర్ఎస్ ద్వితీయ శ్రేణి ప్రజా ప్రతినిధుల పేర్లు కూడా వెల్లడించింది. ఈ వివరాలు బయటకు రావడంతో విజయశాంతి స్పందించారు. అసలైన టిఆర్ఎస్ నేతల పేర్లు బయటకు రాకుండా టిఆర్ఎస్ సర్కార్ జాగ్రత్తపడిందని ఆమె ఆరోపించారు.
నయీమ్ వ్యవహారంపై అసలు నిజాలు వెలుగులోకి వచ్చేందుకు కేంద్ర హోంశాఖ ద్వారా విచారణ జరిపిస్తే టిఆర్ఎస్ బండారం బయటపడే అవకాశం ఉంటుందనీ, నయీమ్ పేరుతో జరిగే నాటకానికి తెరపడుతుందని విజయశాంతి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
https://www.facebook.com/VijayashanthiOfficial/posts/865820653784633