న్యూఢిల్లీ: గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళిగా ఏర్పాటు చేసిన యూనిటి ఆఫ్ స్టాట్యూ విగ్రహానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ టైమ్ మ్యాగ్జిన్ ప్రకటించిన 100 అద్భుత ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. టైమ్ మ్యాగ్జిన్ యూనిటి ఆఫ్ స్టాట్యూకి చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటక ప్రదేశాన్ని ఇటీవల ఒకేరోజే 34 వేల మంది సందర్శించారని తెలిపారు. “స్టాట్యూ ఆఫ్ యూనిటీ” ఒక ప్రధాన పర్యటక ఆకర్షణగా నిలిచిందని మోదీ అన్నారు.
Excellent news vis-à-vis the ‘Statue of Unity’- it finds a spot in the @TIME 100 greatest places 2019 list.
And, a few days back, a record 34,000 people visited the site in a single day.
Glad that it is emerging as a popular tourist spot!https://t.co/zLSNmwCKyc pic.twitter.com/7xmjWCz9xo
— Narendra Modi (@narendramodi) August 28, 2019
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు కృషి చేసిన మహానుభావుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్. ఆయన స్మారకంగా ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో పటేల్ విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని గుజరాత్లో నర్మదానది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. 182 మీటర్ల ఎత్తుగల ఈ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహంగా రికార్డుల కెక్కింది. దాదాపు రూ.3 వేల కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఒక వ్యక్తి 6 అడుగుల ఎత్తైతే, ఆయనకు 100 రెట్ల ఎత్తుతో 182 మీటర్ల (597 అడుగులు) భారీ విగ్రహాన్ని నిర్మించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పిలుస్తున్న దీన్ని 2018 అక్టోబర్ 31వ తేదీన ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
పటేల్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. సందర్శకులు ప్రశాంతంగా చూసేలా ఏర్పాటు చేశారు. కాంస్యంతో నిర్మించడం వల్ల చూడటానికి అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. విగ్రహం ఛాతి వరకు వెళ్లి పరిసరాలను చూసేలా లోపలి నుంచి రెండు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. కాంక్రీట్తో నిర్మించిన రెండు కాళ్ల లోపలి నుంచి ఈ రెండు లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. వాటిద్వారా 157 మీటర్ల ఎత్తు వరకూ సందర్శకులు వెళ్లవచ్చు. అంటే పటేల్ ఛాతి దగ్గర నుంచి ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం ఉంది. సర్దార్ సరోవర్ డ్యాం ఇప్పటికే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. అది ప్రపంచంలోనే అత్యధిక కాంక్రీట్ వాడిన రెండో డ్యాంగా ప్రసిద్ధి చెందింది. పటేల్ విగ్రహం నుంచి చూస్తే.. డ్యాం అందాలు కనువిందు చేస్తాయి.