న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధాని కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఏపి రాజధాని అమరావతిలో కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నది స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. రాజధాని ఏర్పాటు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. రాజధాని తరలింపుపై గగ్గోలు పెడుతున్న టిడిపి వారు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీలేదని జివిఎల్ విమర్శించారు. రాజధాని ప్రాంతంలో అనుకున్నంత మేర అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. అమరావతిలో అవసరానికి మించి భూసేకరణ చేశారని జివిఎల్ అన్నారు. తమకు కావాల్సినవారికి తక్కువ ధరలకు భూములు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయని జివిఎల్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రజాధనం పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని జివిఎల్ పేర్కొన్నారు.
రాజధాని విషయంపై మంత్రులు కూడా పదే పదే వ్యాఖ్యలు చేయడం వల్ల అనిశ్చితి మరింత పెరుగుతుంది తప్ప రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని జివిఎల్ అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాట ఆడకుండా తన విధానం ఏమిటో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని జివిఎల్ అన్నారు.