పట్నా: లైంగిక వేధింపులను అడ్డుకున్నందుకు ఒకే కుటుంబానికి చెందిన 16 మందిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. బీహార్ లోని వైశాలిలో ఈ దారుణ ఘటన జరిగింది. దీనిపై పోలీసు అధికారి రాఘవ్ దయాల్ మాట్లాడుతూ.. గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన చిన్నపిల్లల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవకాస్తా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఒక కుటుంబానికి చెందినవారు ఆగ్రహంతో ఊగిపోయారు. అనంతరం నంద కిషోర్ భగత్ అనే వ్యక్తి ఇంట్లో దౌర్జన్యంగా ప్రవేశించి..ఆయన కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలతో సహా 8మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హాజీపూర్ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. లైంగిక వేధింపులను అడ్డుకున్న కారణంగానే తమపై యాసిడ్ దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.