మతితప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు – అని ఓ కవిసత్తముడు అంటారు. రకరకాల వార్తా ఛానళ్ళు, వాళ్ళు వార్తల పేరున చేసే చర్చలూ రకరకాల కుస్తీలను తలపిస్తాయి. కనుకనే వీక్షకులు మౌనంగా నచ్చని ఛానల్ వదలి సీరియళ్ళ ఛానల్కో, పాటల ఛానల్కో, ఆధ్యాత్మిక ఛానల్కో తరలిపోతారు. హైదరాబాదులో ఆదివారం సాయంకాలం జరిగిన ఒక కార్యక్రమంలో టీఆర్పిల కోసం ఫైటింగుల కార్యక్రమం ఏర్పాటు చేస్తారని ఓ మంత్రి గారు అన్నారు. తెలుగు వార్తా ఛానళ్ళు రెండు డజన్ల దాకా ఉండవచ్చునేమో కానీ స్థూలంగా రెండు రకాలే! ఇది 2004లో చేసిన వర్గీకరణే అయినా నేటికీ వర్తిస్తుంది. ప్రతిధ్వని చూడండి – ఒకరి మీద ఒకరు పడి మాట్లాడరు. చొక్కాలు చించుకోరు. మార్గదర్శి కార్యక్రమం చూడండి – అలాంటిది మరో తెలుగు ఛానల్లో ఉండదు. మొదలు పెట్టినా మూడు నెలలకు స్వరూపం మారిపోతోంది. దేశ రక్షణకు సంబంధించి ఆ మధ్య చర్చా కార్యక్రమాన్ని ప్రతిధ్వనిలో ప్రసారం చేశారు. ఆయా రంగాల నిపుణులను ఆహ్వానించడం గురించి ఈటీవీని అభినందించాలి.
కేంద్రస్థాయిలో హోమ్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి కె. పద్మనాభయ్య చాలా లోతయిన వివరాలు అందించారు. అలాగే సైనికదళానికి చెందిన మరో వ్యక్తి కూడా చాలా అర్థవంతంగా మాట్లాడారు. ఏ విషయం పైనయినా అవగాహన, పట్టు ఉంటే వాదనలో కూడా ఔచిత్యం వుంటుంది. అలాగే ‘చెప్పాలని ఉంది’ అనే గంటపాటు సాగే సంభాషణ కొత్త ప్రయోగం కాదు; మిగతా ఛానళ్ళు ఊహించలేని విషయం. మొన్న శనివారం వందేళ్ల పెద్దలు యడ్లపాటి వెంకట్రావుగారితో ఇచ్చిన పరిచయం మంచి ప్రయత్నం. అంతకు ముందు చిరుధాన్యాల గురించి, ప్రకృతి సేద్యం గురించి, ఇలా మంచి కార్యక్రమాలు ‘చెప్పాలని ఉందిలో’ ప్రసారం చేశారు. పద్మనాభయ్యతో కూడా ‘చెప్పాలని ఉంది’ రూపొందించారు.
అదే సమయంలో ఈ టీవీ నచ్చని వారు పేర్కొనే విషయాల గురించి కూడా చెప్పుకోక తప్పదు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా వేరే భాషలో ఒక ప్రధాన నాయకుడితో రికార్డు చేసిన ఇంటర్వ్యూను సబ్ టైటిల్స్తో ఇవ్వడం వేరే ఛానల్లో ఊహించలేము. అలాగే చర్చ సహజంగా కాకుండా బెత్తం పట్టుకుని నడిపించినట్టు సాగుతూంటుంది.
ఈటీవీలో కొరవడిన ప్రొఫెషనలిజం గమనించి పోటీదార్లు ప్రయత్నాలు చేయవచ్చు. కానీ వారెవరూ ఏమీ చేయకపోవడంతో పాటు వేలంవెర్రిగా పరుగులు తీయడంతో పదిహేనేళ్ళ క్రితం వర్గీకరణ నేటికీ వర్తిస్తోంది. ఆర్టీసి సమ్మెకారణంగా చాలా కాలం తర్వాత అర్ధవంతమైన కార్యక్రమాలు, లైవ్ లీ చర్చలు ప్రసారమయ్యాయి. సమ్మెకు దిగిన రెండో రోజునో, మూడో రోజునో ఫోర్త్ ఎస్టేటులో సాక్షి ఛానల్ ఇచ్చిన చర్చ ఎంతో బాగుంది. అక్టోబరు 15 రాత్రి వి6 ఛానల్ ప్రసారం చేసిన చర్చాకార్యక్రమంలో మాజీ ఎం.పి.కొండా విశ్వేశ్వర రెడ్డి దేశంలోనే కాకుండా ఇతర దేశాల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగాలు ఎలా ఉన్నాయో సాధికారంగా, గంభీరంగా వివరించారు. ఇలా కాకుండా ఆస్థాన పోట్లాటదారులనే ప్యానలిస్టులుగా ఛానళ్ళు సాగడంతో వాటి గౌరవం పోతున్నది.
వేలంవెర్రిగా వార్తలను వ్యంగ్యాన్ని కలిపే ప్రయత్నంగా తీన్మార్ వార్తలు, మాస్ మల్లన్న, ధూంధాం ముచ్చట్లు, గోలీ మార్, స్మార్ట్ న్యూస్ వంటి కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. గోలీమార్ లో స్క్రిప్ట్ రచయిత ఎక్కువ స్వాతంత్య్రం తీసుకుంటున్నారో, లేదా కార్యక్రమం ప్రయోక్త ఉసిగొలుపుతున్నారో కానీ వాడు, వీడు అనే రీతిలో యాంకరింగ్ పార్టీ నడుస్తోంది. గతంలో ఒకసారి చర్చించాం. ఇటీవల ఉద్యోగాలకు రాని ఉపాధ్యాయుని గురించి ఇలా నిందాపూర్వకంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డితో ఇంటర్వ్యూ బావుంది ఇందులో అని పేర్కొనాలని భావిస్తుండగా ఆదివారం రాత్రి యాంకర్ అనసూయతో ఇలాంటి ఇంటర్వ్యూను సినిమా ప్రమోషన్ ఐటమ్ గా మిగతావాటిని కుదించి ఉదారంగా ఇచ్చారు. ఇలాంటి లోగుట్టు ఎజెండా కార్యక్రమాల కారణంగా గౌరవం సన్నగిల్లుతుంది.
కర్నూలు జిల్లా – తెలంగాణ సరిహద్దు గ్రామం నాగులదిన్నెలో ఉండే తుంగభద్ర వంతెన సరిగా లేకపోవడంతో ప్రజల సమస్యల గురించి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వాస్తవికమైన అంశం ప్రసారం చేసింది. అలాగే టీవీ9 కడప – చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉండే మంగంపేట బైరైటిస్ కారణంతో తలెత్తుతున్న సమస్యల గురించి ఆలోచనాత్మకమైన కార్యక్రమం ప్రసారం చేసింది.
డా. నాగసూరి వేణుగోపాల్