హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రగతి భవన్ ముట్టడించేందుకు వచ్చిన రేవంత్, జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతి భవన్ కు బైక్ పై దూసుకొచ్చిన రేవంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అనేక ప్రాంతాలకు తిప్పారు. ప్రగతి భవన్ నుంచి గోల్కొండ ప్రాంతంలో ఉన్న గోల్ఫ్ కోర్టు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిని మరో వాహనంలోకి మార్చారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డు, పుప్పాల గూడ, నార్సింగ్ ప్రాంతాలకు తీసుకెళ్లారు. అక్కడినుంచి చివరిగా కామాటిపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రేవంత్ అరెస్టుకు ముందు నాటకీయ పరిణామాలు జరిగాయి. రేవంత్ రెడ్డిని ముందుగా అరెస్టు చేసేందుకు పోలీసులు జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద నిఘా పెట్టారు. అయితే ఆయన లేరని తెలియడంతో అనుచరుల ఇళ్లు, ప్రగతిభవన్ సమీపంలోని హోటళ్లలో తనిఖీలు చేశారు. పోలీసుల అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి ఇంటి నుంచి నల్లచొక్కా వేసుకుని ప్రగతిభవన్కు బైక్పై వచ్చారు. అయితే, అప్రమత్తమైన పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వ తీరుపై రేవంత్ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్ను ప్రజలు బద్దలుకొట్టడం ఖాయమన్నారు. నిర్బంధాలను అధిగమించి ప్రగతిభవన్ గేట్లను తాకామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు అనిల్, ఇందిర తదితర కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రగతిభవన్ ముట్టడికి వచ్చారు. వారిని బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు ప్రగతిభవన్ ముట్టడికి జగ్గారెడ్ది ఆటోలో వచ్చారు. అయితే, సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రగతిభవన్ వద్దకు రాగానే జగ్గారెడ్డిని అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి జిల్లాల వరకు పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. ప్రగతిభవన్ ముట్టడి కారణంగా బేగంపేట మెట్రో స్టేషన్ను మొదట మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం తిరిగి సేవలు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, సంపత్ కుమార్, షబ్బీర్ ఆలీ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులను గృహనిర్బంధం చేశారు. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించనందుకు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పలువురు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. వరంగల్, వర్ధన్నపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాలను సైతం కేసీఆర్ ధిక్కరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా సర్కార్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో 50 వేల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు.