అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశంసలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడిని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక ‘మంచి సంస్కరణ’గా భావిస్తున్నానని అన్నారు. ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా పేద పిల్లల చదువు గురించి ఆలోచించలేదన్నారు. పేద పిల్లల గురించి ఆలోచించి ఇంత విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన సీఎం జగన్ అని ప్రశంసించారు. ‘మా పిల్లల్ని ఎక్కడ చదివించుకుందాం? వాడు ఎంత పప్పు అయినా స్టాన్ ఫోర్డ్ లో చదివించుకుందామా? ఇంకోచోట చదివించుకుందామా’ అని ఆలోచించారే తప్ప.. పేద పిల్లల గురించి ఆలోచించలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ సీఎం జగన్ ని అభినందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వంశీ పేర్కొన్నారు.