కరోనా కి కనికరం లేదు.. కరోనా ది కర్కోటక హృదయం… కరోనా అంత కాఠిన్యమైనది..!!?? ఆర్ధికాన్ని నాశనం చేసింది. ఆకలి చావులు రుచి చూపిస్తుంది. వలస బతుకులను అతలాకుతలం చేసింది. పేద వర్గాలకి బతుకు భారం చేసింది…! ఇక్కడితో ఆగలేదు. రైతుకి, రాజుకి… పాలకుడికీ, సేవకుడికి చుట్లకు చూపిస్తుంది. ఇంకా ఎన్నాళ్లిలా..? వైరస్ కి వాక్సిన్ రావడం లేదు. వచ్చే అవకాశాలు ఇప్పట్లో కనిపించడం లేదు. కేసులు పెరుగుతున్నాయి.. మరి పరిష్కారం ఏంటి..? ఇదే సగటు మనిషిని వేధిస్తున్న ప్రశ్న.
లాక్ డౌన్ తో సాధించినది ఏంటంటే..?
మార్చి 23 న దేశంలో లాక్ డౌన్ ప్రారంభమయ్యింది. అప్పటికి దేశంలో మొత్తం కేసులు 450 మాత్రమే. ఆ తర్వాత తొలిదశ లాక్ డౌన్ అంటే ఏప్రిల్ 14 నాటికీ దేశంలో కేసులు పెరుగుదల ఉంది. అప్పటికి రోజుకి దేశవ్యాప్తంగా 500 కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం దేశంలో రోజుకి 5000 కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ రెండో దశలో రోజుకి సగటున 1200 .., మూడో దశలో రోజుకి సగటున 2500 కేసులు ఉండగా, ప్రస్తుతం మాత్రం 5 వేలు దాటుతున్నాయి. అయ్యో…! మరి లాక్ డౌన్ తో సాధించినది ఏంటో అనుకుంటున్నారేమో. లాక్ డౌన్ లేకపోతే ఇప్పటికి దేశంలో దాదాపు 5 కోట్ల మంది కరోనా బారిన పడేవాళ్ళు. లాక్ డౌన్ ఉంది కాబట్టి ఈ మాత్రం పెరుగుదల ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం లాక్ డౌన్ ఉన్న దేశంలో ఒక కరోనా నుండి ఇద్దరు, లేదా ముగ్గురికి వైరస్ సోకుతుండగా… లాక్ డౌన్ లేని దేశాల్లో దాదాపు 400 మందికి వైరస్ సోకుతుంది. అందుకే లాక్ డౌన్ దేశాన్ని కాపాడింది.
తగ్గట్లేదుగా ఏం చేయాలి…?
సీఎం జగన్ పదే పదే చెప్తున్నట్టు కరోనాకి వాక్సిన్ వచ్చే వరకు అది మనతోనే ఉంటుంది. ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ, మాజీ సీఎం చంద్రబాబు కూడా పరోక్షంగా చెప్తున్నారు. అయితే సీఎం జగన్ నేరుగా చెప్పేసారు. అది శతశాతం సత్యం. కరోనా మనల్ని వదలదు. పూర్తిస్థాయి వాక్సిన్ వచ్చే వరకు మన జాగ్రత్తలతో మనం ఉండాలి. ప్రపంచంలో ఎయిడ్స్, డెంగ్యూ వంటి రోగాలకు మందు లేదు, వాక్సిన్ లేదు. కానీ అప్రమత్తమై మనం జాగ్రత్తగా ఉంటున్నాం కదా. అలాగే కరోనా విషయంలో కూడా ఎవరికి వారు తమకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జూన్ చివరి వరకు పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలంగాణా సీఎం కేసీఆర్ ఒకసారి ప్రస్తావించారు. మైండ్ నుండి దాన్ని తీసేసి లాక్ డౌన్ తర్వాత కుటుంబాలు, జీవితాలు, రోజువారీ కార్యక్రమాలు, మన బతుకులు చూసుకుని…, ఆ మహమ్మారి రాకుండా జాగ్రత్తగా ఉండాలి.
వాక్సిన్ అవకాశాలు ఇలా…!
ఇక కరోనాకు వాక్సిన్ తయారు చేసేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇండియా సహా అమెరికా, జర్మనీ, బ్రిటన్, రష్యా వంటి దేశాల్లో ప్రయోగాలు కీలక దశలో ఉన్నాయి. అయితే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొంది, ప్రపంచ వ్యాప్తంగా అవసరాలు తీరేలా తయారు కావాలంటే కనీసం పది నెలలు పడుతుంది. అందుకే అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే…!! అన్నిటికంటే ముఖ్యంగా కరోనా వచ్చినా త్వరగా కోలుకునేందుకు వీలుగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇది తప్పనిసరి. ఇతర దేశాల కంటే ఇండియాలో మరణాలు తక్కువగా ఉన్నాయి అంటే కారణం… మన ఆహారపు అలవాట్లు, మన యోగ, మన ఆయుర్వేదం, మన పద్ధతులు, మన దేహాశక్తి. సో… ఎవరికీ వారు కరోనాపై యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే అని పాలకులు, ప్రయోక్తలు, పండితులు, నిపుణులు, నిష్ణాతులు, విమర్శకులు, విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.