అమరావతి, జనవరి 23: వైసిపి అధినేత జగన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు. హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నందున రికార్డులను ఎన్ఐఎకి అప్పగించలేమని పేర్కొంటూ బుధవారం ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు సహకరించడం లేదనీ, దర్యాప్తు వివరాలు అందజేయడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఎన్ఐఎ కోర్టు పూర్తి వివరాలు ఎన్ఐఎ అధికారులకు అప్పగించాలని ఈ నెల 19న సిట్ అధికారులను ఆదేశించింది.
ఎన్ఐఎ కోర్టులో బుధవారం ఈ కేసు విచారణకు వచ్చినపుడు, తాము వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున వివరాలు ఎన్ఐఎ అధికారులకు ఇవ్వలేమని సిట్ అధికారులు స్పష్టం చేశారు.
జగన్పై దాడి జరిగిన కేసును ఎన్ఐఎకి అప్పగించడాన్ని తొలి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి నేతలు వ్యతిరేకిస్తూ వచ్చారు.