ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. వాస్తవా నికి కూటమి పార్టీల్లో రగడ ఏర్పడుతుందని .. దీంతోఇక్కడ గెలుపు తమకు నల్లేరుపై నడకే అవుతుందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంది. కానీ.. అనూహ్యంగా పరిటాల శ్రీరాం వేసిన పాచికతో ఇప్పుడు వైసీపీ చెమట లు కక్కుతోంది. బీజేపీ నుంచి ఇక్కడ సత్యకుమార్ యాదవ్ను ప్రకటించారు. దీంతో రగడ లేకుండా..శ్రీ రాం చేతులు కలిపేశారు. ఇది కూటమిపార్టీలకు బలంగా మారింది. మరోవైపు వైసీపీకి చుక్కలు కనిపిస్తు న్నాయి.
మరోవైపు యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ బీసీల మద్దతును కూడగట్టేందుకు విస్తృత చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన ముదిగుబ్బ మండల అధ్యక్షులు ఆదినారాయణ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి సత్యకుమార్ కు మద్దతు ప్రకటించారు. ఈ నియోజక వర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా అగ్రవర్ణాలకు చెందిన నేతలే దాదాపు 50 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే, తొలిసారిగా ఎన్డీయే కూటమి తరఫున సత్య కుమార్ బరిలో ఉన్నారు.
మొదట్లో సత్యకుమార్ ప్రకటనతో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కాలర్ ఎగరేశారు. విజయం సులువని భావించారు. అనంతరం మారుతున్న సమీకరణాలతో పరిస్థితిలో మార్పు వచ్చింది. సత్యకు మార్ యాదవ్ కు మొదట్లో స్థానికంగా గట్టి మద్దతు లభించలేదు. అనంతరం బీసీ అభ్యర్థి అయిన ఆయనకు మద్దతు ఇస్తే తొలిసారిగా బీసీ అభ్యర్థిని గెలిపించుకున్నట్టు అవుతుందని భావించిన చేనేత వర్గాలు ఆయనకు ప్లస్ అయ్యాయి.
ధర్మవరం పట్టణంలో దాదాపు 80 వేల ఓటర్లు కలిగిన చేనేతలతో పాటు బోయ, బలిజ, ఏకుల, కురుబ సామాజిక వర్గాలు సంపూర్ణ మద్దతు కూడగడితే విజయానికి దోహదపడతాయని సత్యకుమార్ లెక్కలు వేసుకున్నారు. దీనికి తోడు యువ నాయకుడు పరిటాల కూడా తోడయ్యారు. దీంతో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆపశోపాలు పడుతున్నారు. మరోవైపు.. ఆయన వ్యతిరేక వర్గీయులు కూడా సత్యతో చేతులు కలుపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎక్కడం సులువవుతుందని భావించినప్పటికీ.. ఇప్పుడు వైసీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి.