Amalapuram: ఇటీవల కోనసీమ జిల్లా అమలావురం లో తీవ్ర ఉద్రిక్తలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన ఆందోళనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించింది. ఇదే క్రమంలో ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. అయితే ఈ పరిణామం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు శాపంగా మారింది. అయిదు రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Amalapuram: ఇంటర్నెట్ సర్వీస్ నిలిచిపోవడంతో…
ముమ్మడివరం, అమలాపురం, కొత్తపేట, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి. దీంతో ఆరోగ్య శ్రీ, ఉపాధి హామీ పథకం వివరాల నమోదు, డిజిటల్ లావాదేవీల కు విఘాతం ఏర్పడింది. ఉపాధి హామీ ఉద్యోగులు, ఆరోగ్య శ్రీ సిబ్బంది ఫోన్ డేటా సిగ్నల్స్ కోసం గోదావరి తీరాలకు చేరుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు వేరే ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. అయిదు రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టకపోతే తాము నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని ఐటీ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
మరో 18మంది అరెస్ట్
కాగా అమలాపురంలో ప్రశాంత వాతావరణం నెలకొందని ఏపిఎస్పీ కమాండెంట్ విశాల్ గున్ని తెలిపారు. అమలాపురంలో ఎపిఎస్పీ సహా ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై కఠిన చర్యలు తీసుకంటామని ఆయన హెచ్చరించారు. మరో పక్క అల్లర్లపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఆందోళనలకు సంబంధించి తాజాగా తాజాగా మరో 18 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకూ మొత్తం 62 మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. అమలాపురంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని ఎస్పీ తెలిపారు.