టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అఫిడవిట్ లో క్రైస్తవుడుగా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా ఎలా నియమిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరీశ్వరి స్పందించారు.
హింధూ ధర్మాన్ని ఏపీ సీఎం జగన్ చాలా తక్కువగా చూస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో క్రైస్తవుడుగా పేర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా జగన్ నియమించారనీ, ఇది అత్యంత దారుణమైన చర్య అని అన్నారు. టీటీడీ చైర్మన్ గా హిందువులనే నియమించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఏపీలో హిందువులు మేలుకోవాలి లేకపోతే నష్టపోకతప్పదని అన్నారు. ఏపీలో హిందువుల పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరీశ్వరి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. టీటీడీ బోర్డు చైర్మన్ రాజకీయ పునరావాస పదవి కారాదని అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకమున్న వాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరని అన్నారు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగిందనీ, ఆ విషయంపై గలం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగిందన్నారు. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్దమవుతున్నదని అన్నారు. కావున టీటీడీ చైర్మన్ పదవి హిందూ ధర్మం పై నమ్మకమున్న వారిని మరియు హిందూ ధర్మం అనుసరించే వాళ్లని నియమించాలని అని పేర్కొన్నారు.
చిరంజీవి వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్