Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఢిల్లీలో ఉన్న ఆయనను కలిసిన సీఐడీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హజరు కావాలని సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోకా రోడ్డ్ లో గల గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేశ్ ఉండగా, ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి నోటీసులు అందజేశారు. ఈ సందర్భంలో అధికారులకు విచారణకు హజరు అవుతానని లోకేష్ చెప్పినట్లుగా తెలుస్తొంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ వ్యవహారంపై గత ఏడాది నమోదు చేసిన కేసులో ఏ 14 గా లోకేష్ పేరును సీఐడీ ఇటీవల చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరపగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో లోకేష్ కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని, దానికి సంబంధించి నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్ లో మార్పులు చేశారని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
సీఆర్పీసీ 41 ఏ నోటీసులు అంటే అరెస్టు ప్రస్తావన రానందున .. ముందస్తు బెయిల్ పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారు. తొలుత సీఐడీ అధికారులకు లోకేష్ ఆచూకీ లభించలేదని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు లోకేష్ ఆచూకీని కనుగొన్న సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. ఇక, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో లోకేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
లోకేష్ దాఖలు చేసిన పై రెండు ముందస్తు బెయిల్ పిటిషన్ లపై విచారణను ఆక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ..అక్టోబర్ 4వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దంటూ సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. అయితే సీఐడీ అధికారులు కూడా అదే రోజు విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేయడంతో విచారణకు హజరు అవుతారా లేక మరో తేదీ కేటాయించాలని కోరతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు క్వాష్ పిటిషన్ పై విచారణ ఆగస్టు ఆరవ తేదీన జరిగే అవకాశం ఉంది. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తి అయిన తర్వాతనే లోకేష్ ఏపీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.
YS Sharmila: వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై తేల్చని కాంగ్రెస్ అధిష్టానం ..కింకర్తవ్యం..?