CM YS Jagan: మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రంలో తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. నిన్ననే తుఫాన్ తీరం దాటి బలహీనపడింది. బాధితులను ఆదుకునేందుకు పోలీసులు, రెవెన్యూ, తదితర శాఖలు రంగంలోకి దిగాయి. విధి నిర్వహణలో అనేక మంది ఉద్యోగులు తమ ప్రాణాలకు సైతం తెగించి తుఫాను బాధితులకు సేవలు అందించారు. ఈ క్రమంలోనే ఓ పోలీస్ కానిస్టేబులు మృతి చెందారు. విధి నిర్వహణలో మరణించిన కానిస్టేబుల్ విషయంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్ లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ఈ నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ కీలక అదేశాలు ఇచ్చారు. అధికారులంతా వారి వారి పరిధిలోని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. బాధితుల్లో మనం ఉంటే ఎలాంటి సాయం ఆశిస్తామో.. అదే తరహా సహయం వారికి అందించాలని అధికారులకు సూచించారు.
ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు కానీ బాధితులకు మంచి సహాయం ఆందాలని అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలని అధికారులకు సూచించారు. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో, క్యాంపుల నుంచి ప్రజలను తిరిగి సొంత ఇళ్లకి పంపించే సమయంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక, ఇతర సహాయం ఇవ్వాలని చెప్పారు. రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం, జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు సీఎం జగన్. విద్యుత్ సరఫరా పునరుద్దరణకు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు, రోగాలు రాకుండా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
చెట్టుకూలి మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి రూ.30 లక్షల సాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు స్థైర్యంగా నిలబడేలా ప్రభుత్వం తోడుగా ఉంటుందని అన్నారు. వాలంటీర్ల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు మన ప్రభుత్వం తోడుగా ఉంటుందని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు.
ఒక వైపు భారీ వర్షం..ఈదురు గాలులు వీస్తున్న సమయంలో వైఎస్ఆర్ కడప జిల్లా భాకరాపేటలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యకుమార్ జైన్ బైక్ పై వెళుతుండగా, మలినేనిపట్నం వద్ద చెట్టు విరిగి అయనపై పడింది. దీంతో అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి చెందారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఈ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం జగన్ భారీ అర్ధిక సాయాన్ని ప్రకటించారు. దీనిపై పోలీసు ఉద్యోగ సంఘం నేతలు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
Revanth Reddy: రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం .. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..