AP CM YS Jagan: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభ వార్తలు అందిస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు లేదా వారి కుటుంబంలో ఎవరైనా కరోనాతో బాధపడుతున్నా అలాంటి వారికి ఊరట కల్గించే నిర్ణయాన్ని జగన్ సర్కార్ తీసుకున్నది. కరోనా సోకిన ఉద్యోగులకు 20 రోజుల సెలవు మంజూరు చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ సోకి ఆసుపత్రిలో ఉన్నవారికి, హోంఐసోలేషన్ లో ఉన్న వారికి కూడా ఈ సెలవులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సబ్సిడీ పై విద్యుత్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా నెలవారీ వాయిదాలు కట్టేలా వాహనాల తయారీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వేతనాల నుండి నెల వారీ వాయిదాలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. నెలకు రూ.2,500 వరకూ చెల్లించాల వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాలను ఎన్టిపీసీ ఎస్సెల్ సంస్థలు రాయితీతో ఇస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఆసక్తిగల సిబ్బంది ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.
ప్రస్తుతం పెట్లోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వాహనాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పది లక్షల మంది సిబ్బంది ఉండగా తొలి విడతలో లక్ష మందికి ఎలక్ట్రిక్ వాహనాలు అందించనున్నది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు మూడేళ్ల పాటు తయారీ సంస్థే నిర్వహణ బాధ్యత చూసుకుంటుంది.