TG Venkatesh: ఏపి, తెలంగాణ మధ్య జల జగడం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ మంత్రులు ఏపిపై తీవ్ర వ్యాఖ్యలు, ఘాటు విమర్శలు చేస్తున్నా అధికార వైసీపీ నుండి గట్టి కౌంటర్ లు పడటం లేదు. ఈ తరుణంలో రాయలసీమకు చెందిన బీజేపీ ఎంపి టీజీ వెంకటేష్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపి ప్రజల ఓట్లు ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసిఆర్ నీటి గొడవ మొదలు పెట్టారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసమని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు ఇన్ని రోజులుగా సాగునీటి అవసరాలకు ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. కేసిఆర్ ఆమోదంతోనే 2015లో ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేశాయని టీజీ గుర్తు చేశారు. ప్రాజెక్టులో 845 అడుగుల నిల్వ ఉంటే తప్ప రాయలసీమకు నీరు తీసుకువెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ నేతలు బెదిరిస్తే ఏపి నాయకులు భయపడరని టీజీ అన్నారు. దీనికి కారణం కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంత ప్రజలకు ఓట్లు లేవు. కానీ తెలంగాణలో ఏపికి చెందిన టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీలకు చెందిన ప్రజలకు ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. నీటి సమస్య పరిష్కారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ, చిన్న పొరపాటు జరిగినా తరతరాలు నాయకులను ప్రజలు క్షమించరని పేర్కొన్నారు టీజీ వెంకటేష్.
జల వివాదం విషయంలో ఏపి నాయకులు ఎక్కడా పొరపాటు పడకుండా అందరూ ఒకే మాటపై ఉంటే పరిష్కారం లభిస్తుందనీ, ఏపికి మంచి జరుగుతుందని టీజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మాటల గారడీ లేకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా సమస్యను పరిష్కరించుకోవాలని టీజీ సూచించారు.