గత కొద్ది నెలలుగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ముందస్తు ఎన్నికలపైనే కేంద్ర పెద్దలతో చర్చించారు.. ఏపిలో ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై ప్రతి సారీ వైసీపీ నుండి అటువంటిది ఏమీ లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి లేదు. ఏపిలో ఎన్నికలు షెడ్యుల్ ప్రకారమే జరుగుతాయి అని వైసీపీ కీలక నేతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లను కలిశారు.
రాష్ట్రానికి సంబంధించి వివిధ కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించారని అధికార వర్గాలు చెబుతుండగా, రాజకీయ పరమైన అంశాలు ప్రధాని మోడీ, అమిత్ షాలతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో గంటా 20 నిమిషాల పాటు సీఎం జగన్ సమావేశం కావడంతో ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారని సమాచారం. మరో ఆరు నెలల్లో తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమైతే తాను కూడా ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్దమవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ఓ జాతీయ న్యూస్ చానల్ వెల్లడించిన సర్వే ఫలితాల్లోనూ కేంద్రంలో బీజేపీ హవా, రాష్ట్రంలో వైసీపీ హవా స్పష్టంగా ఉన్నట్లుగా పేర్కొంది.
బీజేపీకి 300కుపైగా ఎంపీ స్థానాలు వస్తాయని తెలిపింది. ఇదే క్రమంలో ఏపీలో 25కి 24 స్థానాలు వైసీపీ కైవశం చేసుకుని జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచే అవకాశం ఉన్నట్లుగా అంచనాలు వెల్లడించింది. ఇలా సర్వే ఫలితాలు అటు కేంద్రంలో బీజేపీకి, ఇటు రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా ఉండటంతో ముందస్తుకు ఏపీ సీఎం జగన్ మొగ్గుచూపుతున్నారని సమాచారం. అయితే కేంద్రం కూడా ముందస్తుకు సిద్దమైతేనే తాను కూడా ముందస్తుకు ఓకేననీ లేకపోతే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకుండా ఉంటే ముందస్తుకు వెళతామనీ, ఆ తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తోడ్పాటు అందిస్తామన్న హామీ ఇచ్చారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపిలో ముందస్తు ఎన్నికలు అంటూ జాతీయ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనుక రహస్యం ఇదే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలు అన్నీ కేవలం ఊహాగానాలే అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు.
BJP: రఘునందనా.. ఏ కాలంలో ఉన్నావయ్యా..! మాట్లాడి, తూచ్ అంటే ఊరుకుంటారా..?