AP CM YS Jagan: రెండు రోజుల పర్యటన నిమిత్తం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .. కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతున్నారు. తొలుత హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా అమిత్ షాతో సీఎం జగన్ చర్చించారు.
అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశమైయ్యారు. దాదాపు గంటా 20 నిమిషాల పాటు మోడీతో సమావేశం సాగింది. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రధాన సమస్యలతో పాటు ఏపిలో తాజా రాజకీయ పరిణామాలపైనా ప్రధాని మోడీతో చర్చించినట్లు తెలుస్తొంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.12,911 కోట్ల మంజూరునకు ఇప్పటికే ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. మంజూరైన ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్ కోరారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాం నుండి విడుదల కావాల్సిన రాష్ట్ర ఆర్ధిక లోటు నిధులు దాదాపు రూ.30వేల కోట్లలో గత నెలలో కేంద్రం రూ.10వేల కోట్లు విడుదల చేయగా, మిగిలిన నిధులు కూడా త్వరితగతిన విడుదల చేయాలని సీఎం కోరారు.
సుధీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని మరో సారి ప్రధాని మోడీని కోరారు సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా తీసుకెళ్లేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందనీ, ఈ అంశం కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో కూడా ఉందని చెప్పారు. పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాల్సి ఉందని, ఈ మేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సొంత నిధుల ఖర్చు రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్ చేయాలని కోరారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి పై రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రిని కోరారు. వైఎస్ ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర హామీ ఇచ్చిందనీ, వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగుపడ్డానికి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరమని వివరించారు. స్టీల్ ప్లాంట్కు అత్యంత అవసరమైన ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఏపీ పౌర సరఫరాల శాఖకు దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరు చేయాలని కోరారు.
అంతే కాకుండా తెలంగాణ నుండి రావాల్సిన ఆరున్నర వేల కోట్ల రూపాయల విద్యుత్ బకాయిల సమస్యను మరో సారి మోడీ, షాలకు వివరించారు సీఎం జగన్. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయి నిధులను వెంటనే విడుదలకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలానే రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో మెడికల్ కళాశాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపైనా విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తొంది.
Read More: ఏదో అదుకుంటే .. మరేదో అయ్యింది..!