తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడుగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవేళ కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. అధ్యక్ష ప్రకటన వెలువడినప్పటి నుండి ఆయన మీడియాతో మాట్లాడకపోవడం, కేబినెట్ భేటీకి దూరంగా ఉండటంపై రకరకాల ఊహగానాలు వచ్చాయి. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవిపై కినుక వహించారనీ, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారంటూ పుకార్లు షికారు చేశాయి. వీటన్నింటిపై కిషన్ రెడ్డి ఇవేళ మీడియాకు వివరణ ఇచ్చారు. అనారోగ్యం వల్లే తాను ఇవేళ కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నాననీ, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదని తెలిపారు. తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని ఊహించలేదన్నారు. నిన్న (మంగళవారం) తాను హైదరాబాద్ లో ఉన్న సమయంలో జేపీ నడ్డా ఫోన్ చేసి విషయం చెప్పారన్నారు.
తాను గతంలో ఉమ్మడి ఏపికి రెండు సార్లు, ఆ తర్వాత తెలంగాణ తొలి బీజేపీ అధ్యక్షుడుగా కూడా ఒక సారి పని చేశానని చెప్పారు. నాల్గవ సారి అధ్యక్షుడుగా తనపై అధిష్టానం బాధ్యతలు అప్పగించిందన్నారు. ఎంపిగా గెలిచిన తర్వాత హాంశాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రెండేళ్లు కేబినెట్ మంత్రిగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. తాను ఏనాడూ పార్టీని ఏదీ అడగలేదనీ, కోరలేదనీ, పార్టీ ఆదేశాలను పాటిస్తూ వస్తున్నానని తెలిపారు. 1980 నుండి ఒక సైనికుడిలా పని చేస్తూ వస్తున్నానన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అదికారంలోకి రావాలి అనే లక్ష్యంతో కృషి చేస్తానని, సమిష్టి ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్తానని ఆయన తెలిపారు. ఇవేళ రాత్రి హైదరాబాద్ లో పార్టీ ముఖ్యనేతలను కలిసి మాట్లాడతానని అన్నారు.
ప్రధాని మోడీ వరంగల్లు పర్యటనకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లపై పని చేయాల్సి ఉందన్నారు. పార్టీ నాయకత్వం మొత్తాన్ని ఈ ఏర్పాట్లలో సహకరించాలని కోరుతున్నానని చెప్పారు. మోడీ వరంగల్లు పర్యటనలో రైల్ వ్యాగన్ తయారీ కేంద్రంకు భూమిపూజ చేస్తారని తెలిపారు. 150 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమ రానుందన్నారు. రైల్వే ఓవర్ హాలింగ్ యూనిట్ అని తొలుత అనుకున్నామనీ, కానీ ప్రధాని వ్యాగన్ యూనిట్ పెట్టడానికి అంగీకరించారని చెప్పారన్నారు. వరంగల్లు రైల్వే తయారీ హబ్ గా తయారు చేయబోతున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్ షాప్, తయారీ యూనిట్ రావడం ఇదే మొదటి సారి అని చెప్పారు. అంతే కాకుండా ప్రధాని మోడీ నూతన జాతీయ రహదారులకతు భూమి పూజ చేస్తారని, వరంగల్లు ఎయిర్ స్ట్రిప్ ద్వారా నేరుగా హెలికాఫ్టర్ లో అక్కడికి వచ్చి, భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటారని తెలిపారు. రైల్వే యూనిట్ ను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తారన్నారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
BJP: రఘునందనా.. ఏ కాలంలో ఉన్నావయ్యా..! మాట్లాడి, తూచ్ అంటే ఊరుకుంటారా..?