ఏపీ సీఎం వైఎస్ జగన్ పాఠశాల విద్యాశాఖపై సమీక్ష జరిపి కీలక ఆదేశాలు జారీ చేశారు. నాడు – నేడు కింద పనులు పూర్తి చేసుకున్న పాఠశాలల ఆడిట్ వివరాలను అధికారులు సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి నెలా ఒక సారి ఆడిట్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల మెయింటనెన్స్ ఫండ్ ను వాడుకుని పాఠశాలల నిర్వహణలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ లో పాఠశాలలు తెరిచే నాటికే విద్యాకానుక కింద అన్ని రకాల వస్తువులూ అందించేందుకు కార్యచరణ సిద్దం చేసుకున్నామని అధికారులు వివరించారు. పిల్లలకు స్కూల్ తెలిచే నాటికి విద్యాకానుక కఛ్చితంగా అందించాలని సీఎం తెలిపారు. పాఠశాలల అభివృద్ధి. నిర్వహణపై తరచూ పేరెంట్స్ కమిటీలతో సమావేశాలను నిర్వహించాలని సూచించారు.
వచ్చే విద్యాసంవత్సరం ఉపాధ్యాయులకు, 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు అందజేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రభుత్వం 5,18,740 ట్యాబ్ లు కొనుగోలు చేయనున్నది. బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ లను విద్యార్ధులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి దశలో తరగతి గదులకు డిజిటలైజేషన్ జరిగేలా చూడాలని సీఎం జగన్ చెప్పారు. ప్రతి పాఠశాలను గ్రామ సచివాలయ ఉద్యోగులైన వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు సందర్శించాలనీ, నెల కు ఒక సారి ఏఎన్ఎం సందర్శించే విధంగా చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. మండల స్థాయిలో ఉండే విద్యాశాఖ అధికారుల్లో ఒకరికి అకడమిక్ వ్యవహారాలు, మరొకరికి స్కూల్ నిర్వహణ అంశాలను అప్పగించాలని సీఎం జగన్ ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ అన్నింటిలో కూడా ఇంటర్నెట్ సదుపాయంఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.