CM YS Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మరో సారి విమర్శలు గుప్పించారు సీఎం వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ – 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం జగన్ గురువారం ప్రారంబించారు. అలాగే రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద చంద్రబాబు ఆధారపడతారని విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కుప్పానికే చంద్రబాబు నీరు అందించలేదన్నారు. సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు కు ఉత్తరాంధ్ర మీద ఏమి ప్రేమ ఉంటుందని ప్రశ్నించారు. తాను ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి ఉంటానని అన్నా ఈ దుష్ట చతుష్టయం ఏడుస్తుందని అన్నారు. నాన్ లోకల్స్ చెప్పినట్లే ఈ రాష్ట్రంలో జరగాలంటారని అన్నారు.
అయిదేళ్లు అధికారంలో ఉండి కూడా పేదలకు ఏమీ చేయలేని వీళ్లు .. తమ ప్రభుత్వం మంచి చేస్తుంటే ఏడుస్తుంటారని అన్నారు. చంద్రబాబు అయిదేళ్ల అధికారంలో ఉత్తరాంధ్రకు ఏమైనా మంచి చేశారా అని జగన్ ప్రశ్నించారు. వాళ్ల అబద్దాలను మరో మూడు నెలలు మాత్రమే భరించాలని, స్పష్టమైన తీర్పు ఇవ్వాలని ప్రజలను జగన్ కోరారు. రానున్న రోజుల్లో వాళ్లు వచ్చి ఎన్నో అబద్దాలు చెబుతారని, ప్రతి ఇంటికి కిలో బంగారం, బెంజి కారు కూడా ఇస్తామని చెబుతారని, అలాంటి వారిని నమ్మవద్దని జగన్ సూచించారు.
చంద్రబాబు ఎన్నికలు వచ్చే సరికి దత్తపుత్రుడిపై ఆధారపడతారని జగన్ విమర్శించారు. తెలంగాణలో తాను పుట్టనందుకు దత్తపుత్రుడు బాధపడిపోతున్నానని ఎన్నికల సందర్బంగా చెప్పారని అన్నారు. నాన్ లోకల్ స్టార్ చంద్రబాబుకు పార్టనర్ అని జగన్ అన్నారు. ఆంధ్రపాలకులకు చుక్కలు చూపిస్తానని ప్యాకేజీ స్టార్ తెలంగాణలో డైలాగులు కొట్టారనీ, అక్కడ పోటీ పెడితే స్వతంత్ర అభ్యర్ధి గా పోటీ చేసిన బర్రెలక్క కు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి రాలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇద్దరికీ ఒక సొంత నియోజకవర్గం కూడా లేదని అన్నారు. ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం వస్తుందన్నా వీళ్లు బాధపడుతున్నారని అన్నారు. దొంగల ముఠాగా తయారై రాష్ట్రంలో దోచుకుని తినేందుకు ఇతర రాష్ట్రాల నుండి వస్తుంటారని జగన్ విమర్శించారు.
తొలుత ఆసుపత్రిలో వసతులు, సౌకర్యాలు, వివిధ పరీక్షల పరికరాలను సీఎం జగన్ పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు జగన్. ఈ కార్యక్రమంలో మంత్రులు స్వీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడతల రజిని, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు.
Breaking: విశాఖలో భారీ అగ్ని ప్రమాదం .. ఇండస్ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు