ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. బెస్ట్ అలవెన్స్ స్కూల్ స్కీమ్ ను రద్దు చేస్తూ ఏపి ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో విచారణ జరిగింది. అర్ధాంతరంగా ఈ స్కీమ్ నిలుపుదల చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యార్ధులు పదవ తరగతి పూర్తి అయ్యే వరకూ ఆ స్కీమ్ ను కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల్లో ప్రతిభ కనబర్చిన వారిని కార్పోరేట్ స్కూళ్లలో చదువు కోసం ఈ స్కీమ్ అమలులోకి వచ్చింది. బెస్ట్ స్కూల్స్ స్కీమ్ ను రద్దు చేస్తూ వైసీపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ జీవోను మాల మహానాడు హైకోర్టులో సవాల్ చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ స్కీమ్ కింద ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు కార్పోరేట్ తరహా పాఠశాలలో చదువుతున్నారనీ, ఈ స్కీమ్ ను ప్రభుత్వం రద్దు చేయడం వల్ల విద్యార్ధులు నష్టపోతారనీ, కావున ఈ స్కీమ్ ద్వారా కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఇప్పటికే చదువుతున్న విద్యార్ధులను కొనసాగించాలని న్యాయస్థానాన్ని కోరారు. అనంతరం ప్రభుత్వం తరపున వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటికే ఈ స్కీమ్ కింద చదువుతున్న విద్యర్ధులను పదో తరగతి పూర్తి అయ్యే వరకూ కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 49వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఊరట లభించనుంది.
2008లో అప్పటి ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. 2019 – 20 విద్యాసంవత్సరం వరకూ పక్కాగా ఈ స్కీమ్ అమలు చేశారు. స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో 1,5, 9 తరగతుల్లో ప్రవేశాలను కల్పించి ఫీజులు ప్రభుత్వమే చెల్లించేది. ఒకటవ తరగతి విద్యార్ధులకు లాటరీ ద్వారా, 5,8 తరగతుల విద్యారధులకు వ్రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసే వారు. రెసిడెన్షియల్ విద్యార్ధులకు ఏడాదికి రూ.30వేలు, నాన్ రెసిడెన్షియల్ విద్యార్ధులకు రూ.20వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుండేది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు పేరుతో అభివృద్ధి చేయడం, అమ్మఒడి పథకం కింద రూ.15వేలు అందజేస్తుండటం, ఇంగ్లీషు మాథ్యమాన్ని ప్రవేశపెట్టి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన నేపథ్యంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ను నిలుపుదల చేస్తూ ఈ పథకానికి నిధులు నిలిపివేసింది. దీంతో వివిధ ప్రవేటు పాఠశాలల్లో ఈ స్కీమ్ ద్వారా ప్రైవేశాలు పొందిన విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.