AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. తుఫాను, వరదల కారణంగా గత నెలలో నాలుగు జిల్లాల్లో జరిగిన అపారనష్టం బాధలను మరువకముందే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. విశాఖకు 960 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి నేడు బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. అయితే ఈ తుఫానుకు జవాద్ అనే నామకరణం చేశారు వాతావరణ అధికారులు. ఇది వాయువ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.
AP Rain Alert: రెండు రోజులు భారీ, అతి భారీ వర్షాలు
దీని ప్రభావంతో రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం రాత్రి నుండి తీరం వెంబడి గంటకు 45 నుండి 65 కిలో మీటర్లు, శనివారం 70- 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో శనివారం వరకూ 95 రైళ్లను నిలిపివేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ అధికారులు తెలియజేశారు. వీటిలో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నట్లు చెప్పారు.
మరో పక్క తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల కలెక్టర్ లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలను తెరిచేందకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ధేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాట చేశారు. తుఫాను సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఏఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేశారు.