AP Govt: ఆంధ్రప్రదేశ్లో జగన్మోహనరెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగడం లేదనీ, సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలు అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్గా మార్చేశారనీ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో జగన్మోహనరెడ్డి సర్కార్ పాలనకు కితాబు ఇచ్చేలా ఓ ప్రముఖ సంస్థ సర్వే నివేదికను వెల్లడించడం వైసీపీ శ్రేణులను ఆనందింపజేస్తున్నది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల పనితీరును నిగ్గు తేల్చేందుకు ఇండియా టుడే సంస్థకు చెందిన మార్కెటింగ్ – డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ) ద్వారా 2003 నుండి ఏటా సర్వే నిర్వహిస్తోంది. 2021కి గానూ ఈ ఏడాది జూలై నుండి నవంబర్ వరకూ దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టారు.
AP Govt: సమ్మిళిత అభివృద్ధిలో మొదటి స్థానం
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సమ్మిళిత అభివృద్ధి (ఇన్క్లూజివ్ గ్రోత్) సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని ఆ సంస్థ వెల్లడించింది. అదే విధంగా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల్లో ఏపి తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. గత ఏడాది ఏడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాల జాబితా 2018లో చంద్రబాబు హయాంలో పదవ స్థానంలో ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019 లో 8 వ స్థానం, 2020 (గత ఏడాది)7వ స్థానం, ఈ ఏడాది 6వ స్థానంకు ఎగబాకింది. ఇండియా టుడే సంస్థ నిర్వహిస్తున్న ఈ సర్వేకు దేశ వ్యాప్తంగా విశేష గుర్తింపు ఉంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంతో ఏపి అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం శాచ్యురేషన్ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతోనే ఇది సాధ్యమైందని సర్వే నివేదకలో విశ్లేషించింది.