న్యూఇయర్ వేడుకలను పురస్కరించుకుని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండటం సర్వసాధారణం. అయితే ఫ్లెక్సీలకు సంబంధించి కొన్ని సందర్భాలలో వివాదాస్పదం అవ్వడం, చర్చనీయాంశం అవ్వడం, ఘర్షణలకు కారణం కావడం కూడా జరుగుతుంటుంది. ప్రస్తుత రాజకీయాలలో చాలా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు ఉంటాయి. ఫ్లెక్సీల ఏర్పాటుతో ఆయా నాయకుడి వర్గంగా కార్యకర్తలు గుర్తింపు పొందుతుంటారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే కార్యకర్తలు వారి ఫోటోలతో వారి అభిమాన నాయకుల ఫోటోలను సదరు ఫ్లెక్సీలలో ఏర్పాటు చేస్తుంటారు.
అయితే నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం నియోజకవర్గంలో జూనియర్ ఎన్ టీ ఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం ఏమిటంటే నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి, ఆ పార్టీ నేతల ఫోటోలతో పాటు దానిలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో వేసి దాని కింద రాబోయే కాలానికి కాబోయే సీఎం 2024 నెక్స్ట్ సీఎం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారనేది ఆశక్తికరంగా మారింది.
గతంలోనూ ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజితారావు టీడీపీ ఇన్ చార్జిగా అజితారావు ఉన్నారు. ఇప్పుడు ఆమె అభిమానులు జూనియర్ ఎన్ టి ఆర్ ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయ్యింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. కేవలం 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకే టీడీపీ పరిమితం అయ్యింది. దీంతో రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే నందమూరి తారక రామారావు వారసుడుగా జూనియర్ ఎన్ టి ఆర్ రావాల్సిందేనని ఆ పార్టీ నేతల నుండి చాలా సందర్భాలలో వినిపించింది. అయితే జూనియర్ ఎన్ టీ ఆర్ మాత్రం చాలా సందర్భాలలో ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదంటూ తెలిపారు. అయినప్పటికీ టీడీపీలోని నందమూరి అభిమానులు జూనియర్ రాకనే కాంక్షిస్తున్నారు. పార్టీలో చంద్రబాబుతో సన్నిహితంగా ఉండే కొందరు నేతలు కూడా లోకేష్ నాయకత్వంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ ను ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ పుంజుకోవాలన్నా, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం కల్గించాలన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే సాధ్యమవుతుందనేది ఆ పార్టీలోని కొందరి వాదనగా ఉంది. అయితే వీరు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలంటూ ఆకాంక్షిస్తున్నా బహిరంగంగా మాట్లాడితే చంద్రబాబు, లోకేష్ లకు దూరం కావాల్సి వస్తుందన్న భయంతో మిన్నకుండిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకం అయితే క్యాడర్ లో ఊపు వస్తుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆ పార్టీలో మరో సారి చర్చకు దారి తీసింది. దీనిపై జిల్లా పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.