టీడీపీ ఆశలపై బీజేపీ ఏపి కో ఇన్ చార్జి సునీల్ థియోధర్ నీళ్లు చల్లారు. కేంద్ర బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో టీడీపీ కలవబోతున్నదంటూ టీడీపీ అనుకూల మీడియాలో ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా బీజేపీ అనుకూల మీడియాగా పేరున్న రిపబ్లిక్ టీవీలోనూ కథనాలు రావడంతో ఏపి రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. అజాదీగా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమానికి అహ్వానం అందడంతో ఏపి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల హజరైయ్యారు. ఆ సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. చంద్రబాబును పక్కకు తీసుకువెళ్లి ఓ అయిదు నిమిషాలు ముచ్చటించారు. దీంతో చంద్రబాబు బీజేపీకి దగ్గర అవుతున్నారు, బీజేపీ కూడా సానుకూల సంకేతాలు ఇస్తుందంటూ టీడీపీ అనుకూల మీడియా కథనాలు ఇస్తొంది. దానికి తోడు టీడీపీ ఫ్యామిలీ మెంబర్ అయిన సినీ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో ఇటీవల హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షా ఏకాంతంగా చర్చలు జరపడం, అంతకు ముందు టీడీపీకి రాజ గురువుగా పేరున్న ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతోనూ అమిత్ షా సమావేశం కావడంతో ఇక ఇదంతా రాబోయే ఎన్నికల్లో బీజేపీ వ్యూహమేనంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీ శ్రేణులు కూడా బీజేపీతో చేతులు కలిపితే, జనసేన – బీజేపీ- టీడీపీ పొత్తుతో ఇక రాబోయే ఎన్నికల్లో ఢోకా లేదు అన్నట్లుగా భావిస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ ఆశలను నీరు గార్చే విధంగా బీజేపీ రాష్ట్ర కో ఇన్ చార్జి సునీల్ ధియోధర్ స్టేట్ మెంట్ ఇవ్వడం సంచలనం అయ్యింది.
ఏపిలో జరుగుతున్న ఊహాగానాలపై సునీల్ ధియోధర్ స్పందించారు. ఎన్డీఏతో టీడీపీ కలవబోతున్నదంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు సునీల్ థియోధర్. పొత్తుల అంశంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఢిల్లీలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. చంద్రబాబును మాత్రమే కలవలేదనీ, చాలా మంది నేతలను కలిశారని గుర్తు చేశారు. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని అన్నారు సునీల్ థియోధర్. ఏపిలోని రెండు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలంటూ ఆయన విమర్శించారు.
2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు కూడా బీజేపీతో కలిసి పోటీ చేసినప్పుడే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఉమ్మడి ఏపిలో అధికారంలోకి వచ్చింది. గడచిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీలో బీజేపీ భాగస్వామ్యం అయ్యింది. ఏపిలో బీజేపీ నుండి ఇద్దరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించగా., టీడీపీ కూడా కేంద్ర కేబినెట్ లో చేరింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2013లో ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది. అదే క్రమంలో ఏపి కేబినెట్ నుండి బీజేపీ మంత్రులు బయటకు వచ్చారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దూరం కావడంతో టీడీపీ ఘోర ఓటమి చవి చూసింది. ఈ తరుణంలోనే టీడీపీ అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతోందంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే ఇటీవల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు టీడీపీ మద్దతు ఇవ్వడం., ఆ తర్వాత ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ కావడంతో ఎన్డీఏతో టీడీపీ కలవబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని సునీల్ ధియోధర్ కొట్టిపారేశారు.
బిగ్ బ్రేకింగ్: ఏపిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటునకు కేంద్రం ఆమోదం