BJP – Janasena : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్ ను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదీ బీజేపీ – జనసేన శ్రేణుల్లో ప్రకంపనాన్ని సృష్టిస్తోంది. ఓ పక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆ పార్టీ అధికారిక గుర్తు అయిన గాజు గ్లాసును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించడం తీవ్ర దుమారాన్నే రేపుతుంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆ కారణంగానే బీజేపీ నానా తంటాలు పడి, సీఎం పదవీ కూడా ఏరగా చూపి పవన్ ను ప్రసన్నం చేసుకున్నారు.
ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే…ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించని బీజేపీ….ఏపిలో ఓ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంలో సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అంటూ ప్రకటించి ప్రొజెక్టు చేస్తున్నారు అంటే పవన్ అభిమానులు, ఆ నేత సామాజిక వర్గ ఓట్లు గుంప గుత్తగా బీజేపీ వేయించుకోవాలన్న రాజకీయ ఎత్తుగడేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ కల్యాణ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని పవన్ అభిమానుల్లో చెరగని ముద్రవేసుకున్న ఆ ఎన్నికల గుర్తుపై నవతరం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుండటంతో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతోంది. దీంతో ఖంగుతున్న బీజేపీ దీని వెనుక వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఉన్నారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతిలో బీజేపీ – జనసేన ప్రభంజనానికి భయపడి వారు అనుచరులతో జనసేన ఎన్నికల గుర్తును కుట్రతో తీసుకున్నారని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. ఇదే సందర్భంలో బీజేపీ -జనసేన అభ్యర్థిని ఎదుర్కునేందుకు అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను దింపి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై నేరుగా సమాధానం చెప్పే ధైర్యం లేక తమ పార్టీ నేతలపై మంత్రులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.