Breaking: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరో సారి షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుపై మరో సారి సస్పెన్షన్ వేటు వేసింది ఏపి సర్కార్. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై గతంలో విధించిన సస్పెన్షన్ తొలగించిన ఏపి ప్రభుత్వం ఇటీవలే పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమించగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అయితే సర్వీసు నిబంధనలకు విరుద్దంగా క్రమశిక్షణారహిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏబి వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోంశాఖలో పరికరాల కొనుగోలులో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ పై అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తరువాత ఏబీ వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆయనను విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఆరు నెలల చొప్పున రెండేళ్లకు పైగా ఆయన సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. అయితే రెండేళ్లకు పైగా సివిల్ సర్వీస్ అధికారిని సస్పెన్షన్ లో కొనసాగించకూడదన్న నిబంధన మేరకు ఆయనను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు పలు మార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. సీఎస్ ను కలిసేందుకు వెళ్లిన సందర్భంలోనూ ఏబీ వెంకటేశ్వరరావుకు అపాయింట్మెంట్ లభించలేదు. ఈ విషయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లోనే మీడియాకు వెల్లడించారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఆ తరువాత సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పోస్టింగ్ కొరకు కూడా ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అదే క్రమంలో తన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ తప్పులు ఉన్నాయనీ, ఈ ఏడాది మార్చి నెల నుండే సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారనీ, దాన్ని సరి చేయాలని కోరారు. కాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత నెలలో సస్పెన్షన్ ఎత్తివేస్తూ జీఏడి లో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. రెండు వారాల క్రితం పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ సర్వీస్ డిపార్ట్ మెంట్ కు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరవుపై మరో సారి సస్పెన్షన్ వేటు పడింది.