YS Sharmila Party: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, ఏపి సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణ రాజన్న రాజ్యం తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ టీపీ రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రారంభం నుండి సీఎం కేసిఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు, రైతుల సమస్యలు ఇలా పలు సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ రాష్ట్రంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో వైఎస్ షర్మిల దూకుడుగా రాజకీయాలు చేస్తున్న తరణంలోనే ఇటీవల ఏపిలోనూ షర్మిల పార్టీ పెట్టనున్నారంటూ వార్తలు షికారు చేశాయి. సోదరుడు ఏపి సీఎం వైఎస్ జగన్ తో విబేధాలు వచ్చాయనీ, అందుకే ఏపిలోనూ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారంటూ జగన్ వ్యతిరేక మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
YS Sharmila Party: తనకు ఎలాంటి సంబంధం లేదు
ఈ తరుణంలోనే ఏపిలో పార్టీ పెట్టే విషయంపై ఓ మీడియా ప్రతినిధి షర్మిలను ప్రశ్నించగా ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు. పార్టీ పెట్టకూడదని రూల్ ఏమైనా ఉందా అంటూ ఎదురు ప్రశ్చించారు. తనకు ఆ ఉద్దేశం ఏమీ లేదని స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. మరల తాజాగా మరో సారి తాను తెలంగాణ కోసమే పార్టీ స్థాపించినట్లు వెల్లడించారు. ఏపిలో షర్మిల పార్టీ అనే అంశం హాట్ టాపిక్ గా నడుస్తున్న ఈ తరుణంలో ఆమె భర్త అనిల్ కుమార్ చాలా కూల్ గా స్పందించారు. ఈ రోజు ఆయన విజయవాడ వచ్చిన సందర్భంలో గన్నవరం విమానాశ్రయం వద్ద పలువురు మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ఆయనను ప్రశ్నించారు. దీనిపై బ్రదర్ అనిల్ మాట్లాడుతూ షర్మిల పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని బదులు ఇచ్చారు. పార్టీ గురించి తాను మాట్లాడనని తెలిపారు. విజయవాడలో తన సొంత పని మీద వచ్చానని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు.