Chandra Babu: టీడీపీ అధినేత, ఏపి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు అయ్యింది. ఇటీవల రాష్ట్రంలో భయంకరమైన కరోనా వైరస్ ఎన్ 440 కే అనవాళ్లు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తుంటే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదనీ, లాక్ డౌన్ అమలు చేయాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు. ప్రజలను అనవసరంగా భయ భ్రాంతులకు గురి చేయవద్దని, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ 440 కే వైరస్ వేరియంట్ ఉనికిలో లేదని పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలతో చంద్రబాబు పై కేసు నమోదు చేశారు.
ఇంతకు ముందే తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దీనిపై వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కోవిడ్ పై అసత్య, తప్పుడు ప్రచారాలపై కేసు నమోదు చేయాల్సివస్తే ముందుగా చంద్రబాబుపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. ఇటీవల విజయసాయి రెడ్డి చెప్పింది ఇప్పుడు నిజం అయ్యింది. చంద్రబాబుపై కేసు నమోదు చేయడం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.