Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో ఈ ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్టునకు ముందు నంద్యాలలో పెద్ద హైడ్రామా నడిచింది. అరెస్టు సమయంలో చంద్రబాబు తో పాటు ఆయన న్యాయవాదులు సీఐడీ అధికారులతో వాదనలకు దిగారు. తనను అరెస్టు చేయడానికి వచ్చిన సీఐడీ అధికారులపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడగా రిమాండ్ రిపోర్టు ద్వారా అన్ని అనుమానాలు నివృత్తి చేస్తామని సీఐడీ అధికారులు చెప్పడంతో చంద్రబాబు చప్పుడు చేయకుండా అరెస్టు కావడానికి అంగీకరించారు.
తొలుత నాపై ఎఫ్ఐఆర్ లేదు. ఏదో జరిగిందని కేసు పెట్టారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారు. స్కీల్ డవలప్ మెంట్ స్కామ్ లో నా పేరు ఎక్కడ ఉందో చూపించండి. ఆధారాలు ఉంటే ఉరి తీయండి, దర్యాప్తు అధికారి రాకుండా సూపర్ వైజర్ అధికారి రావడం ఏమిటి. మీరు చుట్టుముట్టి నన్ను బెదిరిస్తారా అంటూ సీఐడీ అధికారులతో వాదనకు దిగారు చంద్రబాబు. దీంతో విజయవాడ వెళ్లే సమయానికి రిమాండ్ రిపోర్టు అందిస్తామనీ, ముందే ఇవ్వడం కుదరనీ, రిమాండ్ రిపోర్టులోనే అన్ని విషయాలు ఉంటాయని సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు. మరో పక్క నాన్ బెయిలబుల్ సెక్షన్ లతో కేసు పెట్టారు, సంబంధం లేని సెక్షన్లు నమోదు చేశారు. అరెస్టునకు ముందే కు వివరుల చెప్పాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సీఐడీ అధికారుల వద్ద పట్టుబట్టడంతో చంద్రబాబు పాత్ర ఉందని హైకోర్టుకు చెప్పామని సమాధానం ఇచ్చారు సీఐడీ అధికారులు.
అర్ధరాత్రి పూట డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏమిటి, నేను ఏమైనా టెర్రరిస్టునా, ప్రాధమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారా అంటూ మరో సారి చంద్రబాబు వాగ్వివాదానికి దిగారు. దీంతో తమకు అరెస్టు చేసిన తర్వాత 24 గంటల వరకూ సమయం ఉంటుందనీ, గడువులోగా కోర్టుకు అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తామని చంద్రబాబు న్యాయవాదులకు తెలియజేశారు. అరెస్టునకు ముందు ప్రాధమిక సాక్ష్యాలు చూపించాలని చట్టంలో లేదని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. దాదాపు గంటకుపైగా వాదనలకు దిగిన చంద్రబాబు సీఐడీ అధికారుల వివరణతో అరెస్టునకు సంబంధించి పేపర్లపై సంతకం చేసి వారికి సెరండర్ అయ్యారు చంద్రబాబు.
తొలుత శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు అరెస్టు చేయడానికి ఆర్కే ఫంక్షన్ హాలు వద్దకు వెళ్లిన సీఐడీ అధికారులను చంద్రబాబు భద్రతా సిబ్బంది అడ్డుకుంది. ఈ సమయంలో డిస్ట్రబ్ చేయమని, తెల్లవారిన తర్వాత మాట్లాడటానికి అనుమతిస్తామని ఎన్ఎస్జీ కమాండోలు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబుతో సీఐడీ అధికారులను మాట్లాడటానికి అనుమతించారు.
స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసును ఏపీ సీఐడీ 2021 డిసెంబర్ 9న నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు ను 37 వ నిందితుడుగా పేర్కొన్నారు. ఆయనపై 166, 167, 418, 420, 465, 468, 471,409, 201, 109 రెడ్ విత్ 120 బీ ఐపీసీ, 13(2), రెడ్ విత్ 13(1)సీ, రెడ్ విత్ 13(1)(డీ) పీసీఏ సెక్షన్ ల కింద కేసు నమోదు అయి ఉంది.