CJI Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ) ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొనగా, జీవిత సాఫల్య పురస్కారాన్ని రోటరీ క్లబ్ అందజేసింది. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ఆయన అన్నారు. ఈ సందర్భంలో రూల్ ఆఫ్ లా, మాతృభాష ప్రాముఖ్యత, ప్రజల హక్కుల గురించి మాట్లాడారు.
CJI Justice NV Ramana: మేధావి వర్గం రాజ్యాంగం, హక్కుల గురించి తెలియజెప్పాలి
మేధావి వర్గంగా ఉన్న వారందరూ ప్రజలకు రాజ్యాంగం, హక్కుల గురించి తెలియజెప్పాలని సీజేఐ జస్టిస్ రమణ సూచించారు. అన్ని వ్యవస్థల తరహాలోనే న్యాయ వ్యవస్థ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యతను మరచిపోతున్నామని అన్నారు. సమస్య వచ్చినా, హక్కులకు భంగం కలిగినా సామాన్య ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నారు. చిన్న వారు నుండి పెద్ద వారు వరకూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. నేటికీ సరైన అవగాహన ప్రజల్లో లేదన్నారు. కోర్టులకు వస్తే ప్రజలకు అర్ధం కాని భాషతో ఇబ్బంది పెట్టకూడదనీ, అన్నీ వారికి అర్ధమయ్యే న్యాయస్థానం అంటే గౌరవం కలుగుతుందని పేర్కొన్నారు.
CJI Justice NV Ramana: మాతృభాషే ఎదుగుదలకు పునాది
ప్రభుత్వం కార్యనిర్వహక వర్గం చట్టపరిధిలో పని చేస్తే కోర్టుకు రానవసరం లేదని అన్నారు. పరిధి దాటితే కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు. పౌర హక్కుల ఉల్లంఘన జరిగినా.. ప్రశ్నించే తత్వం ప్రజల్లో ఉండాలన్నారు. రూల్ ఆఫ్ లా లేకుంటే ఆరాచకం పెరుగుతుందనీ, అరాచకం పెరిగితే ప్రజాస్వామ్యానికి ముప్పు అని అన్నారు. తెలుగు భాష శిధిలం కాకుండా చూసుకోవాలన్నారు. ఎన్ని భాషలు వచ్చినా ఆలోచనాత్మక ధోరణి మాతృభాషతోనే సాధ్యమనీ, మన ఎదుగుదలకు పునాదికి మాతృభాషే కీలకమని అన్నారు. ఇంగ్లీషు భాష నేర్చుకోండి, కానీ మాతృభాష తోనే అక్షరాలు దిద్దండి. మాతృభాషతోనే పునాది పటిష్టంగా ఉంటుంది. తెలుగు భాష, తెలుగు జాతి గొప్పతాన్ని అందరికీ తెలియచేయండి ఇదే నేను ప్రజలకు ఇచ్చే సందేశంగా స్వీకరించండి అని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సీజేఐ గా వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాననీ, జడ్జీల భర్తీ, ఇతర సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.