ఒ సీనియర్ నాయకుడు మరో పార్టీ నాయకుడికి భజన చేయడం ఆ పార్టీ నేతలకు నచ్చడం లేదు. దీంతో ఆ నేత తీరుపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తొంది. ఆ నేత తీరుపై స్వపక్షంలోని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును ఆ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా ఖండించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు చింతా మోహన్ మాత్రం గత కొద్ది రోజులుగా చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ పదేపదే మాట్లాడుతుండటం, ఆయన నిర్దోషి అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
గత నాలుగైదు రోజులుగా చంద్రబాబుకు మద్దతుగా ఆయన చేస్తున్న కామెంట్స్ పై స్వపక్షంలోని నాయకులు ఆయనపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టడం తప్పని, చంద్రబాబు ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయా అని చింతా మోహన్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కుట్ర ఉందని కూడా ఆయన ఆరోపిస్తూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓ పక్క చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుంటే ఆయనకు సపోర్టుగా ఉండాల్సిన అవసరం ఏమిటని చింతా మోహన్ ను అక్కడి కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఒక సారి చంద్రబాబు అరెస్టును ఖండించి వదిలివేస్తే సరిపోయే దానికి అదే పనిగా ప్రతి రోజు చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2018 లో ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత అసలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. యూపీఏకి దూరంగా ఉన్నారు. మరల ఎన్డీఏ స్నేహహస్తం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు చంద్రబాబు. అందుకే చింతా మోహన్ ప్రవర్తనపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
చింతా మోహన్ 1984 నుండి వరుసగా మూడు సార్లు, ఆ తర్వాత 1998 ఎన్నికల్లో. మరల 2004, 2009 లో వరుసగా రెండు సార్లు మొత్తం ఆరు సార్లు తిరుపతి ఎంపీగా గెలిచారు. తొలి సారి 1984లో మాత్రం ఆయన టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా గెలుస్తూ వచ్చారు. 2014,2019, 2021 ఉప ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా తయారైందన్న సంగతి అందరికీ తెలిసిందే. తిరుపతి నుండి మళ్లీ గెలవాలి అంటే టీడీపీ సపోర్టు ఉంటే సాధ్యపడుతుందన్న లెక్కల్లో చింతా మోహన్ ఉన్నారనీ, అందుకే చంద్రబాబు భజన చేస్తున్నారని అంటున్నారు ఆయన ప్రత్యర్ధులు.
టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన చింతా మోహన్ కు ఇంకా వాసన పోలేదేమో అన్న కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఆయన టీడీపీలోకి వెళ్లాలనుకుంటే నేరుగా చేరవచ్చు గానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడుగా రోజు చంద్రబాబు నామస్మరణ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. చింతా మోహన్ పై ఆ పార్టీ నేతలు చేసిన ఫిర్యాదుపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.