KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన పోలిక. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఈ ఇద్దరు సీఎంల మధ్య సఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడుగా పలు నిర్ణయాలు సేమ్ టు సేమ్ ఉంటున్నాయి.
తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపీ కొట్టేశారని అంటున్నారు. అందులో ఎన్నికలకు దూరంగా ఉండటమే నిర్ణయం కావడం సహజంగానే హాట్ టాపిక్ గా మారింది.
KCR కేసీఆర్ ఏం చేశారంటే…
తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అవుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే పెద్దఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్పించారు. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆచితూచి అడుగులు వేస్తోన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల విషయానికి వస్తే.. ఒక స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీకే ఛాన్స్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.
ఆ మేరకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పల్లా రాజేశ్వర్రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు కూడా. కానీ మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్లో అలికిడి లేదు. వివిధ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయిందట టీఆర్ఎస్.
జగన్ సైతం సేమ్….
ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నామినేషన్ పక్రియ ప్రారంభం అయ్యింది. ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మార్చి 14 ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండు స్థానాలకు ఉపాధ్యాయ సంఘాల నుండి గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపై అధికార పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకూడదని సీఎం జగన్ నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. నాన్ పొలిటికల్గా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కలుగచేసుకోవడం సరికాదని భావించిన సీఎం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగు జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలను పిలిచి.. వారికి ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా ఇద్దరు సీఎంలు కీలకమైన మండలి ఎన్నికలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమే!