Heavy Flood: విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్ 65) పై మున్నేటి వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేటి వాగు ఉధృతితో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుండి వాహనాల రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్ గేట్ నుండి విజయవాడ వైపు సుమారు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు వెళ్లాల్సిన వాహనాలను కోదాడ, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. ప్రస్తుతం మున్నేరుకు లక్షా 90వేలకుపైగా క్యూసెక్కుల వరద వస్తొంది. వరద ఇంకా పెరుగుతుందనే అంచనాతో అధికారులు అప్రమత్తమైయ్యారు.
నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లు ట్రాఫిక్ లో చిక్కుకున్న ప్రయాణీకులకు అల్పాహారం, వాటర్ బాటిళ్లు ఏర్పాటు చేశారు. వివిధ స్వచ్చంద సంస్థలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నందిగామ, కంచల ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న రైతు కూలీలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చారు.
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఐతవరం వద్ద అధికారులతో కలిసి వరద ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మీడియాతో మాట్లాడుతూ వరద క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఇప్పటికే రెండు అడుగుల మేర వరద నీటి మట్టం తగ్గిందని మరి కొంత సమయం వేచి చూసి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని, పై నుండి వస్తున్న వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. జాతీయ రహదారిపై వరద ప్రవాహం తగ్గిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సాయంత్రానికి వాహనాల రాకపోకలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా ఐతవరం వద్ద మున్నేటి వరద ప్రవాహాన్ని తిలకించేందుకు నందిగామ, అంబారుపేట, ఐతవరం తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య టీడీపీ నేతలతో కలిసి వరద ప్రవాహాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం చేశారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ..