ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయం పై క్లారిటీ వచ్చేసింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్కుమార్, టీడీపీ కూటమి అభ్యర్థిగా టి. కృష్ణ ప్రసాద్(ఈయన తెలంగాణ బీజేపీ నాయకుడు. పైగా టీడీపీ సీనియర్ మాజీ నాయకురాలు.. శమంతకమణి అల్లుడు కూడా), కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పోటీలో ఉన్నారు. దీంతో ముక్కోణపు పోటీ ఖాయమని తెలుస్తోంది.
ముఖ్యంగా నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీ అయినా.. బాపట్ల పరిధిలో కొంత వ్యతిరేకత అయితే.. ఆయన ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాజదాని గ్రామాల్లో ఆయన ఇక్కడి రైతులకు వ్యతిరేకంగా చేసిన కామెంట్లు, అదేవిధంగా దూకుడు స్వభావం వంటివి మైనస్గా మారాయి. ఇక, టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న కృష్ణ ప్రసాద్ ఇక్కడివారికి కొత్త. దీంతో ఆయన వెంట ఎంత మంది నడుస్తారనే భావన ఉంది. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక, కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న జేడీ శీలం చుట్టే ఇప్పుడు బాపట్ల రాజకీయం తిరుగుతోంది. పాతతరం నాయకులను శీలం ఏకం చేస్తున్నారు. అయితే.. గతంలో ఎప్పుడు ఇక్కడ విజయం దక్కించుకున్న అనుభవం శీలానికి లేదు. కానీ, కేడర్ మాత్రం ఉంది. ఇంతకు ముందు పనబాక లక్ష్మి విజయం దక్కించుకున్న నేపథ్యంలో ఆ వర్గం తనకు సహకరిస్తుందన్నది శీలం అంచనాగా ఉంది. ఇక, వైసీపీ వ్యతిరేకత కూడా తనకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.
మరోవైపు షర్మిల దూకుడు.. ప్రభుత్వంపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వంటివి కూడా పని చేస్తాయన్నది శీలం ఆశల్లో ఒక భాగం. ఎలా చూసుకున్నా.. ఈయన గెలుస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఓట్లు చీల్చడంలో మాత్రం శీలం ఎఫెక్ట్ మాత్రం పడుతుందనేది ఖచ్చితంగా తెలుస్తోంది. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చితే.. అది కూటమి అభ్యర్థికి మైనస్ అవుతుంది. అలా కాకుండా.. వైసీపీలోని అనుకూల వర్గాన్ని తనవైపునకు తిప్పుకొంటే.. అది కూటమి అభ్యర్థికి ప్లస్ అవుతుందనే అంచనా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.