Pawan Kalyan: విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మూడో విడత వారాహి యాత్రలో భాగంగా గాజువాకలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రజలు, జనసైనికులు హజరు కాగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మరో సారి విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని అన్నారు. తాను తప్పు చేయలేదు.. ఇక్కడ ఓడిపోయాను అంతే.. తన పని తాను చేసుకుపోతానని చెప్పుకొచ్చారు. దోపిడీ చేసే వ్యక్తికి 151 సీట్లు ఇచ్చారని అన్నారు. ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే గాజువాకలో తాను ఓడిపోయినట్లు భావించడం లేదని అన్నారు. పోరాటం ఎలా చేయాలో ఉత్తరాంధ్ర తనకు నేర్పించిందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదనీ, ఎంతో మంది బలిదానాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటు అయిన స్టీల్ ప్లాంట్ కోసం 26 వేల ఎకరాల ఇచ్చారనీ, స్టీల్ ప్లాంట్ కు భూమి ఇచ్చిన వారిలో ఇంకా సగం మందికి పరిహారం రాలేదని అన్నారు. ప్రాజెక్టుకు, పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు. 2018 లో ఇక్కడి వైసీపీ ఎంపీపై రౌడీ షీట్ ఉందనీ, ఇలాంటి వారిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడగలరా అని ప్రశ్నించారు. జనసేన తరపున ఎంపీ లేకపోయినా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తాను ప్రధానితో విభేదించానన్నారు. స్టీల్ ప్లాంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రాన్ని కోరానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్క ఎంపీ కూడా విశాఖ స్టీల్ కు సొంత గనులు కేటాయించాలని అడగలేదన్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని ఢిల్లీ పెద్దలకు తాను చెప్పానన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. విశాఖను రాజధాని చేసి ఏం చేస్తారంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
గంగవరం పోర్టు వద్ద పోలీసు కాల్పుల్లో మత్స్యకారుడు చనిపోయారు కానీ పోర్టు నిర్వాసితులకు ఇంకా న్యాయం చేయలేదన్నారు. పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించరా అని ప్రశ్నించారు. ఆస్తులు అమ్ముకునేందుకా ప్రజలు ఆయనను సీఎంగా ఎన్నుకున్నది అని ప్రశ్నించారు. జగన్ ను మరో ఆరు నెలలు భరించాలన్నారు. ప్రజల మద్దతు లేకుంటే తాను ఏమీ చేయలేననీ, వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ప్రజలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు.
ప్రధాన మంత్రి మోడీ సూచనతో ట్విట్టర్ డీపీ మార్చిన బీసీసీఐ .. గోల్డెన్ టిక్ మాయం