Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలను సీరియస్ తీసుకోవడం లేదనీ, అటు సినిమాలు తీసుకుంటూ ఖాళీ సమయాల్లో వచ్చి వెళుతుంటారని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటారనీ, సమయం చూసి పంజా విసురుతారని ఆయన అభిమానులు అంటుంటారు. జనసేన ప్రభావం ఏమిటి అనేది రాష్ట్రంలో టీడీపీకి, వైసీపీ గత ఫలితాలను బట్టి తెలుస్తూనే ఉంది. 2014 టీడీపీ అధికారంలోకి రావడానికి, వైసీపీ ఒడిపోవడానికి కారణం అయ్యింది జనసేన. 2019లో జనసేనను దూరం చేసుకోవడం వల్ల టీడీపీకి ఎంత మైనస్ జరిగిందో తెలుసు. జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచినా జనసేన చీలక ఓట్ల ప్రభావంతో 30 నుండి 40 స్థానాలు టీడీపీ కోల్పోయింది. 2019 ఎన్నికల్లో జనసేన లెక్కలు తప్పాయి. అయితే 2024 నాటికి ఒక ప్రత్యేక స్ట్రాటజీతో ముందుకు సాగాలని జనసేన ప్లాన్ చేస్తోందట. రాజకీయ ప్రత్యర్ధులను ఒక్కరొక్కరిని లక్ష్యంగా చేసుకుని వారిని మాజీలను చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా జనసైనికులు చెబుతున్నారు.
Janasena: గోదావరి జిల్లా పై ఫోకస్
2019 ఎన్నికల్లో విశాఖ సిటీలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పరాజయం పాలైయ్యారు. అయితే రాబోయే 2024 ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల నుండే మరల పోటీ చేస్తారా లేక జనసేనకు బలమైన క్యాడర్ ఉన్న తూర్పు గోదావరి నుండి బరిలోకి దిగుతారా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాను ఎంచుకోవడానికి బలమైన కారణం కూడా ఉందని అంటున్నారు జనసైనికులు. పవన్ కళ్యాణ్ హిట్ లిస్ట్ మంత్రి కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారట. ప్రజారాజ్యం పార్టీ రాజకీయ అరంగ్రేటం చేసి ఎమ్మెల్యే అయిన కన్నబాబు అనంతరం కాంగ్రెస్ పార్టీలో తరవాత వైసీపీలో చేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. అటువంటి కన్నబాబు ప్రతి సారి తనను తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంపై పవన్ సీరియస్ గా ఉన్నారని టాక్.
మరో పక్క కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ పై పదేపదే విమర్శలు చేస్తూ, పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అంటూ కూడా దూషించారు. దీంతో జనసైనికులు వీళ్లిద్దరిపై చాలా సీరియస్ గా ఉన్నారు. కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్ గానీ, ద్వారంపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ సిటీ నుండి గానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసి వారికి సరైన గుణ పాఠం చెప్పాలని భావిస్తున్నారుట. పవన్ కాకినాడలో పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై ఉంటుందని జనసైనికులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేయనున్నారు అనే దానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.